ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్ తగిలింది. ఇటీవలే ప్లేయర్ ట్రేడింగ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి జట్టులోకి తెచ్చుకున్న హార్దిక్ పాండ్యా అప్ కమింగ్ సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకోవడమే కాకుండా అతనికి సారథ్య బాధ్యతలను కూడా ముంబై ఇండియన్స్ అప్పగించింది.
ఐదు సార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మను పక్కనపెట్టి హార్దిక్ పాండ్యాను తమ నూతన సారథిగా ప్రకటించింది. జట్టు భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. ముంబై ఇండియన్స్ తీసుకున్న ఈ నిర్ణయంపై రోహిత్ శర్మ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరైతే ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా ఖాతాలను అన్ఫాలో చేశారు.

రోహిత్ శర్మ అభిమానుల శాపనార్థాలో లేక హార్దిక్ పాండ్యా దురదృష్టమో ఏమో కానీ ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి హార్దిక్ పాండ్యా దూరం కానున్నాడు. వన్డే ప్రపంచకప్లో హార్దిక్ పాండ్యా తీవ్రంగా గాయపడ్డాడు. బంగ్లాదేశ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో బౌలింగ్ చేసిన అనంతరం బ్యాటర్ ఆడిన స్ట్రైట్ డ్రైవ్ను ఆపే క్రమంలో హార్దిక్ పాండ్యా కాలు మెలిక పడింది.
గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రపంచకప్తో పాటు సౌతాఫ్రికా పర్యటనకు హార్దిక్ దూరంగా ఉన్నాడు. కనీసం అఫ్గానిస్థాన్తో సిరీస్కైనా అతను అందుబాటులోకి వస్తాడని అంతా భావించారు. కానీ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి దూరం కానున్నాడని తెలుస్తోంది.
ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్యా టీమిండియాను నడిపించే అవకాశం ఉంది. అయితే హార్దిక్ పాండ్యా గైర్హాజరీ గురించి ముంబై ఇండియన్స్ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. ఒకవేళ హార్దిక్ పాండ్యా దూరమైతే ముంబై ఇండియన్స్ సారథి ఎవరా? అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. మళ్లీ రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. రోహిత్ అనాసక్తి చూపిస్తే సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలో ఒకరు జట్టును నడిపించే అవకాశం ఉంది.