టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తన స్వస్థల రాంచీలోని దేవరీ ఆలయాన్ని సందర్శించారు. ఈ దేవాలయంలోని దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. ధోనీ ఇలా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం ఇదే తొలిసారి కాదు. ముఖ్యమైన పనులు చేపట్టే ముందు ధోనీ ఈ ఆలయాన్ని సందర్శించి దుర్గాదేవి ఆశీర్వాదం తీసుకుంటాడు.
తొలిసారి భారత జట్టులోకి ఎంపికైనప్పటి నుంచి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడు. కీలక పర్యటనలు, వరల్డ్ కప్ టోర్నీలు, ఐపీఎల్కు ముందు ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా సందర్శించి అమ్మవారికి పూజలు చేస్తాడు.

ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో ఈ సారి దుర్గాదేవి ఆశీర్వాదం కోసం ఈ దేవ్రీ ఆలయాన్ని ధోనీ సందర్శించాడు. ధోనీ ఆలయానికి వచ్చిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. దేవ్రీ ఆలయానికి ధోనీ వచ్చాడని తెలుసుకున్న అతని అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కుర్రాళ్లు ధోనీతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ధోనీ ఓపిగ్గా వారికి సర్దిచెబుతూ ముందుకు సాగారు.
వచ్చే నెలలోనే ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ధోనీ తన సన్నాహకాలను ప్రారంభించాడు. ఇప్పటికే జిమ్లో గంటల కొద్ది శ్రమిస్తూ ఫిట్నెస్పై ఫోకస్ పెట్టిన ధోనీ.. ఇక నుంచి ఆటపై దృష్టిసారించనున్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్పై మరింత ఫోకస్ చేయనున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో మోకాలి నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడిన ధోనీ.. ఆ టోర్నీ అనంతరం శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.
ఈ క్రమంలోనే గత రెండు నెలలుగా ఫిట్నెస్పై సీరియస్గా ఫోకస్ పెట్టాడు. నాలుగేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన ధోనీ.. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. అప్పటి నుంచి ధోనీ ఆడే ప్రతీ సీజన్ అతనికి చివరిదని ప్రచారం జరుగుతుంది. కానీ ధోనీ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ముందుకు సాగుతున్నాడు.
మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐపీఎల్ విండోను మార్చి నుంచి మే వరకు బీసీసీఐ ఖరారు చేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్ను ఖారారు చేయడంపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. ఎన్నికల తేదీలు వెలువడిన తర్వాత వాటికి అనుగుణంగా షెడ్యూల్ తయారు చేయనుంది.