ఐపీఎల్ 2024 సీజన్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కీలక ప్రకటన చేశాడు. 'కొత్త సీజన్.. కొత్త పాత్ర' కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నానని, త్వరలోనే అప్డేట్ ఇస్తానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ధోనీ ప్రకటనతో అభిమానులంతా షాకయ్యారు.
ధోనీ చెప్పిన కొత్త పాత్ర ఏంటా? అనేది సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొని మెంటార్గా కొనసాగుతాడా? లేదా ఏదైనా యాడ్ కోసం ఇలా పోస్ట్ చేశాడా? అనే చర్చ జోరుగా సాగుతోంది. సోషల్ మీడియాకు దూరంగా ఉండే ధోనీ... అప్పుడప్పుడు వ్యాపార ప్రకటనలు చేస్తుంటాడు. ఈ పోస్ట్ కూడా అందులో భాగమేనని సీఎస్కే ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరికొందరు మాత్రం ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొని మెంటార్గా కొనసాగే అవకాశం ఉందని, ఇది అదే ప్రకటన అని పేర్కొంటున్నారు. ఐపీఎల్ 2023 సీజన్లో మోకాలి గాయంతో ఇబ్బంది పడిన ధోనీ.. అనంతరం శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ కోసం ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు.
ప్రస్తుతం అతను ముఖేష్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సతీసమేతంగా పాల్గొన్నాడు. కెరీర్ ప్రారంభంలోలా లాంగ్ హెయిర్తో బాలీవుడ్ హీరోను తలపించే లుక్లో మెరిసాడు. ధోనీ స్టైలిష్ లుక్కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు టైటిళ్లు గెలిచింది.
మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో చెన్నై సూపర్ కింగ్స్.. ఆర్సీబీతో తలపడనుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీసీసీఐ 22 మ్యాచ్ల షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఫస్టాఫ్ షెడ్యూల్లో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు మ్యాచ్లు ఆడనుంది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు:
మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా, డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజవర్ధన్ హంగార్గేకర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే, మతీష పతీరణ, సిమ్రాన్జీత్ సింగ్, ప్రశాంత్ సోలాంకి, మహీశ్ తీక్షణ, అజింక్యా రహానే, షేక్ రషీద్, నిశాంత్ సిందు, అజయ్ మండల్. రచిన్ రవీంద్ర (రూ. 1.8 కోట్లు), శార్దూల్ ఠాకూర్(రూ. 4 కోట్లు), డారిల్ మిచెల్(రూ. 14 కోట్లు), సమీర్ రిజ్వీ( రూ. 8.40 కోట్లు), ముస్తాఫిజుర్ రెహ్మాన్( రూ. 2 కోట్లు), అవనీష్ అరవెల్లి(రూ. 20 లక్షలు)