ఐపీఎల్ వల్లనే విదేశీ ఆటగాళ్లను అర్థం చేసుకోగలిగానని చెన్నై సూపర్ కింగ్స్ సారథి, టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్ కోసం సమయాత్తం అవుతున్న ధోనీ.. మంగళవారమే చెన్నైకి చేరుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ప్రీ సీజన్ ప్రాక్టీస్ క్యాంప్లో పాల్గొననున్నాడు.
ఈ క్రమంలో ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోనీ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఫస్ట్ సీజన్ నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు.

'ఐపీఎల్ అరంగేట్ర సీజన్ 2008లో చెన్నై సూపర్ కింగ్స్ చాలా సమతూకంగా ఉంది. అప్పటి జట్టులో స్టార్ ఆల్రౌండర్లు ఉన్నారు. మాథ్యూ హెడెన్, మైక్ హస్సీ, ముత్తయ్య మురళీధరన్, జాకోబ్ ఓరమ్ వంటి స్టార్ ఆటగాళ్లను ఒకే డ్రెస్సింగ్ రూమ్లో ఉంచడం.. అందరి గురించి పరస్పరం తెలుసుకోవడం నాకు సవాల్గా మారింది.
ఒక జట్టుకు సారథ్యం వహించేటప్పుడు.. అందులో ప్రతీ ఆటగాడినీ పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆటగాడి గురించి పూర్తిగా తెలిసినప్పుడే అతనిలోని బలాలు, బలహీనతలను అంచనా వేయగలం. అప్పుడే జట్టును సరైన దిశలో నడిపించగలం.
ఐపీఎల్ కారణంగానే నాకు విదేశీ ఆటగాళ్లను అర్థం చేసుకునే అవకాశం లభించింది. అప్పటి వరకు ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లతో నేను ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు. కానీ ఐపీఎల్ కారణంగా వారితో సాన్నిహిత్యం పెరిగింది. ఈ టోర్నీతోనే విదేశీ ఆటగాళ్లను అర్థం చేసుకోగలిగాను. వారి సామర్థ్యాలతో పాటు బలహీనతలు తెలుసుకున్నాను. వారి సాంప్రదాయాలు ఏంతో కూడా తెలిసాయి. వీటి వల్లే ఐపీఎల్ మరింత ఆసక్తికరంగా ప్రత్యేకంగా మారింది.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.
16 ఏళ్ల ఐపీఎల్ కెరీర్లో ధోనీ 226 మ్యాచ్లకు సారథ్యం వహించాడు. అత్యధిక మ్యాచ్లు గెలిచిన తొలి ఐపీఎల్ కెప్టెన్గా కూడా రికార్డు అందుకున్నాడు. ఈ టోర్నీలో సీఎస్కే ధోనీ సారథ్యంలో 133 విజయాలందుకుంది. ఐదు టైటిళ్లను గెలిచింది. ఐపీఎల్ 2024 సీజన్కు మార్చి 22న తెరలేవనుండగా.. చెన్నై వేదికగా జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే.. ఆర్సీబీతో తలపడనుంది.