ఐపీఎల్ 2024 సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) నిష్క్రమించడంతో ఆ జట్టు దిగ్గజ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ చిల్ అవుతున్నాడు. ఐపీఎల్ కోసం గత రెండు నెలలుగా బిజీగా గడిపిన మహీ.. టోర్నీ నుంచి సీఎస్కే నిష్క్రమించడంతో మళ్లీ తన సాధారణ జీవితం గడిపేందుకు సిద్దమయ్యాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో సీఎస్కే 27 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. సీఎస్కే ప్లే ఆఫ్స్ చేర్చేందుకు ధోనీ, జడేజా చివరి వరకు చేసిన పోరాటం ఫలించలేదు. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే తన స్వస్థలం రాంచీకి వెళ్లిన ధోనీ.. సోమవారం తనకిష్టమైన బైక్ పై షికారుకు వెళ్లాడు.

ఓవైపు ధోనీ రిటైర్మెంట్ గురించి సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతుండగా.. మరోవైపు ధోనీ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా చిల్ అవుతున్నాడు. ధోనీ బైక్ రైడింగ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హెల్మెట్ ధరించి తన యమహా బైక్పై ధోనీ షికారుకు వెళ్లాడు. అతను తన బైక్పైకి ఫామ్ హౌస్లోకి తిరిగి వస్తుండగా.. ఒకరు తమ మొబైల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియోకు అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఈ సీజన్లో మొత్తం 14 మ్యాచ్లు ఆడిన ధోనీ220.55 స్ట్రైక్రేట్తో 161 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 31 నాటౌట్. వికెట్ కీపర్గా 10 క్యాచ్లు పట్టాడు. ఈ సీజన్తోనే ధోనీ ఐపీఎల్ కెరీర్ ముగిసిందనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఐపీఎల్ రిటైర్మెంట్పై ధోనీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
గత సీజన్లో మాత్రం చెన్నై వేదికగా సొంత అభిమానుల సమక్షంలో ఆటకు వీడ్కోలు పలుకుతానని చెప్పాడు.
ఆ క్రమంలోనే చెన్నై వేదికగా జరిగే ఈ సీజన్ ఫైనల్ ఆడి ఆటకు గుడ్ బై చెప్పాలని ధోనీ ప్లాన్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆర్సీబీ రూపంలో సీఎస్కేకు బిగ్ షాక్ తగలడంతో ధోనీ రిటైర్మెంట్ వ్యూహాలు దెబ్బతిన్నాయి. వచ్చే ఏడా మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ధోనీ ఐపీఎల్లో కొనసాగడం కష్టంగా కనిపిస్తోంది. ఒక్క సీజన్ కోసం ధోనీని రిటైర్మెంట్ చేసుకుంటే జట్టుకు తీవ్ర నష్టం జరగనుంది.
మరోవైపు సీఎస్కే మేనేజ్మెంట్ సైతం ధోనీ రిటైర్మెంట్పై స్పష్టత లేదని ప్రకటించింది. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించేందుకు కొంత సమయం కావాలని ధోనీ చెప్పాడని పేర్కొంది.