'కొత్త సీజన్.. కొత్త పాత్ర కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను. త్వరలోనే అప్డేట్ ఇస్తాను'అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన ఫేస్బుక్ పోస్ట్ తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ పోస్ట్తో అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ధోనీ.. సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొని మెంటార్గా కొనసాగుతాడా? అనే చర్చ జోరుగా సాగింది.
ధోనీ ఈ సీజన్ ఆడడేమోనని అతని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కానీ ధోనీ తన కొత్త పాత్ర ఏంటో తెలియజేస్తూ అందరికి షాకిచ్చాడు. చాలా మంది ఊహించినట్లుగానే ధోనీ ఓ యాడ్ కోసం ఈ పోస్ట్ పెట్టినట్లు స్పష్టమైంది. ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్కాస్టర్ జియోసినిమా రూపొందించిన యాడ్లో ధోనీ కొత్త పాత్రలో కనిపించాడు.

ఈ ఐపీఎల్ ప్రకటనలో ధోనీ వృద్ధుడి పాత్ర పోషించాడు. ఈ ప్రకటనలో తెల్లని వెంట్రుకలతో పాటు మీసాలతో మొబైల్లో జియోసినిమా ద్వారా క్రికెట్ చూస్తున్న ముసలి ధోనీకి గుండెపోటు వస్తోంది. అతన్ని వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రిలోకి తరలించే ప్రయత్నం చేయగా.. ముసలి ధోనీ నొప్పితోనే క్రికెట్ చూస్తుంటాడు.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు ధోనీ చెప్పిన కొత్త పాత్ర ఇదేనేమోనని కామెంట్ చేస్తున్నారు. ధోనీ మాత్రం ఈ వీడియోపై స్పందించలేదు. ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ కోసం అతను సిద్దమవుతున్నాడు. ముఖేష్ అంబాని రెండో కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమానికి సతీసమేతంగా హాజరైన ధోనీ.. అక్కడి నుంచి నేరుగా మంగళవారం చెన్నైకి చేరుకున్నాడు.
వచ్చిన వెంటనే చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంప్లో పాల్గొన్నాడు. నెట్స్లో గంటలకొద్దీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ధోనీ రాకపై చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యేక వీడియోను రూపొందించింది.