సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ రీఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఐపీఎల్ 2024 సీజన్కు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. ఇక ఐపీఎల్ పునరాగమనం వెనుక మిచెల్ స్టార్క్ మాస్టర్ ప్లాన్ ఉంది. ఐపీఎల్ 2014 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తరఫున చివరిసారిగా ఆడిన మిచెల్ స్టార్క్.. 27 మ్యాచ్ల్లో 34 వికెట్లు తీసాడు.
ఆ సీజన్ తర్వాత ఐపీఎల్కు దూరంగా ఉన్న అతను 2018 సీజన్లో రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ సీజన్ వేలంలో కోల్కతా నైట్రైడర్స్ అతన్ని కొనుగోలు చేసినా గాయం కారణంగా ఆడలేకపోయాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు ప్రాధాన్యమిచ్చిన అతను ఐపీఎల్కు దూరంగా ఉన్నాడు.

అయితే టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఐపీఎల్ ఆడాలనుకుంటున్నట్లు మిచెల్ స్టార్క్ తాజాగా వెల్లడించాడు. టీ20 ప్రపంచకప్ ముంగిట ఐపీఎల్ ఆడటం తనకు ఉపయోగపడుతుందని తెలిపాడు. 'ఐపీఎల్కు దూరమై 9 ఏళ్లు గడిచాయి. వచ్చే ఏడాది కచ్చితంగా రీఎంట్రీ ఇస్తా. టీ20 ప్రపంచకప్ ముందు ఐపీఎల్ ఆడటం నాకు ఉపయోగపడుతోంది. అందుకే ఐపీఎల్లోకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నా. ప్రపంచకప్ ముందు బెస్ట్ ప్లేయర్లతో ఆడిన అనుభవం దక్కుతుంది.'అని మిచెల్ స్టార్క్ తెలిపాడు.
ఆసీస్ తరఫున ఇప్పటి వరకు 82 టెస్ట్లు, 110 వన్డేలు, 58 టీ20లు ఆడిన స్టార్క్.. మూడు ఫార్మాట్లలో కలిపి 625 వికెట్లు పడగొట్టాడు. ఇక మిచెల్ స్టార్క్ సతీమణి, ఆస్ట్రేలియా స్టార్ వికెట్ కీపర్ అలిసా హేలీ వుమెన్స్ ప్రీమియర్ లీగ్లో యూపీ వారియర్స్కు ఆడుతోంది. డబ్ల్యూపీఎల్ వేలంలో ఆమె రూ.70 లక్షల ధర పలికింది.
ఐపీఎల్ 2024 మినీ వేలం మిచెల్ స్టార్క్కు భారీ ధర పలికే అవకాశం ఉంది. అతని కోసం ఆర్సీబీ, సీఎస్కే, సన్రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్, పంజాబ్ కింగ్స్ పోటీ పడే అవకాశం ఉంది. లోయరార్డర్లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అతనికి కలిసొచ్చే అంశం. ఈ ఏడాది డిసెంబర్లో ఐపీఎల్ 2024 మినీ వేలం జరగనుంది.