కోల్కతా నైట్రైడర్స్ స్టార్ పేసర్, ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్ చెత్త రికార్డ్ నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే రూ. 24.75 కోట్ల అత్యధిక ధర పలికిన ఈ ఆసీస్ స్టార్.. తొలి మ్యాచ్లోనే తీవ్రంగా నిరాశ పరిచాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో శనివారం జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన స్టార్క్.. ఒక్క వికెట్ కూడా తీయకుండా 53 పరుగులు సమర్పించుకున్నాడు.
ఐపీఎల్ చరిత్రలోనే మిచెల్ స్టార్క్.. ఓ స్పెల్లో 50 ప్లస్ రన్స్ ఇచ్చుకోవడం ఇదే తొలిసారి. తొలి మూడు ఓవర్లలో 27 పరుగులే ఇచ్చిన స్టార్క్..తన ఆఖరి ఓవర్లో హెన్రీచ్ క్లాసెన్ ధాటికి 26 పరుగులు సమర్పించుకున్నాడు. అతను వేసిన 19వ ఓవర్లో క్లాసెన్ వరుసగా మూడు సిక్స్లు బాదాడు. షెహ్బాజ్ అహ్మద్ మరో సిక్సర్ బాదగా.. స్టార్క్ ఓ వైడ్ వేసాడు. క్లాసెన్ ఓ సింగిల్ తీయడంతో ఈ ఓవర్లో మొత్తం 26 పరుగులు వచ్చాయి.

చివరి ఓవర్లో హర్షిత్ రాణా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కేకేఆర్ 4 పరుగులతో విజయం సాధించింది. లేకుంటే ఈ మ్యాచ్లో సన్రైజర్స్ గెలిచి ఉంటే స్టార్క్ మరిన్ని విమర్శలు ఎదుర్కొనేవాడు. అతని వల్లే కేకేఆర్ ఓడిపోయిందనే అప్రతిష్టను మూటగట్టుకునేవాడు. ఆఖరి ఓవర్లో హర్షిత్ రాణా.. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి షెహ్బాజ్ అహ్మద్తో పాటు క్లాసెన్ను ఔట్ చేయడంతో కేకేఆర్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్లో హెన్రీచ్ క్లాసెన్(29 బంతుల్లో 8 సిక్స్లతో 63) కనబర్చిన అసాధారణ పోరాటం వృథా అయ్యింది. సన్రైజర్స్ హైదరాబాద్ చివరి ఐదు బంతుల్లో 7 పరుగులు చేయలేకపోయింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 208 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఆండ్రూ రస్సెల్(25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్లతో 64 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్ చెలరేగాడు. అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులే చేసి ఓటమిపాలైంది.