ఐపీఎల్ 2024 సీజన్కు రంగం సిద్దమైంది. మరో నాలుగు రోజుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్కు తెరలేవనుంది. ఈ సీజన్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ తమ కెప్టెన్ను మార్చిన విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాను క్యాష్ ట్రేడింగ్ డీల్ ద్వారా జట్టులోకి తెచ్చుకుంది. ఆ వెంటనే అతన్ని తమ నూతన సారథిగా ప్రకటించింది.
ఐదు టైటిళ్లు అందించిన కెప్టెన్ను రోహిత్ శర్మను కాదని హార్దిక్కు అవకాశం ఇచ్చింది. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు హెడ్ కోచ్ మార్క్ బౌచర్ సోమవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అయితే ఓ ప్రశ్నకు ఈ ఇద్దరూ నోరు మెదపలేకపోయారు.

సమాధనం చెప్పని కోచ్..
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు వెనుక ఉన్న అసలు కారణం ఏంటని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. మార్క్ బౌచర్ మౌనంగా ఉండిపోయాడు. సమాధానం చెప్పేందుకు నిరాకరించాడు. హార్దిక్ పాండ్యా సైతం నోరు మెదపకుండా నిశబ్దంగా ఉండిపోయాడు. సమాధానం చెప్పేందుకు ఇద్దరూ నిరాకరించారు.
గతంలో జట్టు కోసమే అంటూ..
ఓ పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మార్క్ బౌచర్.. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుకు గల కారణాలను వెల్లడించాడు. 'ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు అనేది పూర్తిగా క్రికెట్కు సంబంధించిన నిర్ణయం. హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకోవడానికి గల అవకాశాలన్నింటిని మేం పరిశీలించాం. ట్రేడింగ్ విండో ద్వారా తీసుకున్నాం. ఇది జట్టుకు ట్రాన్సిషన్ ఫేజ్. భారత్లో చాలా మందికి ఇది అర్థం కాదు.
దాంతో అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. అయితే అంతగా బాధపడాల్సిన పని లేదు. ఇది కేవలం క్రికెట్కు సంబంధించిన నిర్ణయం మాత్రమేనని వారు గుర్తించాలి. ఒక వ్యక్తిగా, ఆటగాడిగా రోహిత్ నుంచి అత్యుత్తమమైన ప్రదర్శన రావాలని కోరుకుంటున్నా. అతన్ని స్వేచ్చగా ఆడేలా చేయండి. ఆటను ఆస్వాదించే అవకాశం ఇవ్వండి.'అని మార్క్ బౌచర్ చెప్పుకొచ్చాడు.
రోహిత్ సతీమణి కామెంట్తో..
ఈ వీడియోను మార్క్ బౌచర్ తన స్కోషల్ మీడియా ఖాతాలో పంచుకోగా.. రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే స్పందించింది. 'ఈ నిర్ణయంలో చాలా తప్పులున్నాయి' అని కామెంట్ చేసింది. దాంతో మార్క్ బౌచర్పై భారత అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పించారు. దాంతో అతను ఆ వీడియోను డిలీట్ చేశాడు. మరోసారి అలాంటి పరిస్థితి రావద్దనే మార్క్ బౌచర్ సైలెంట్గా ఉన్నట్లు తెలుస్తోంది.
మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్కు తెరలేవనుండగా.. 24న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగే మ్యాచ్తో ముంబై ఇండియన్స్ తమ క్యాంపైన్ను ప్రారంభించనుంది.