ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై టీమిండియా మాజీ క్రికెటర్, బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీ కారణంగా ముంబై ఇండియన్స్ ఓటమిపాలవుతుందని అభిప్రాయపడ్డాడు. అతని చెత్త కెప్టెన్సీ ఇలానే కొనసాగితే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కూడా చేరదని హెచ్చరించాడు.
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ ఫలితంపై మాట్లాడిన మనోజ్ తివారీ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు గుప్పించాడు. తొలి ఓవర్ను జస్ప్రీత్ బుమ్రాతో వేయించుకుండా హార్దిక్ వేయడాన్ని తప్పుబట్టాడు.

బుమ్రాకు ఇచ్చి ఉంటే కొత్త బంతితో స్వింగ్ చేసి వికెట్ తీసేవాడని తెలిపాడు. 'హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీ ఇలానే కొనసాగితే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరకుండా ఇంటిదారి పడుతోంది. గతంలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లంతా రోహిత్ శర్మతో ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరూ కూడా హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా పరిగణించడం లేదు.
జస్ప్రీత్ బుమ్రా వంటి వరల్ట్ స్పెషలిస్ట్ పేసర్తో తొలి ఓవర్ వేయించకపోవడం ఘోర తప్పిదం. బట్లర్ సెంచరీతో ఫామ్లో ఉండగా.. జైస్వాల్ ఏ మాత్రం ఫామ్లో లేడు. ఇలాంటి పరిస్థితుల్లో అత్యుత్తమ బౌలర్కు బౌలింగ్ ఇస్తే వికెట్ తీస్తాడు. హార్దిక్ పాండ్యా తొలి ఓవర్ వేసి రెండు బౌండరీలు సమర్పించుకున్నాడు.
కొత్త బంతితో పెద్దగా స్వింగ్ కూడా చేయలేదు. దాంతో బ్యాటర్లకు సులువైంది. ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ చూస్తుంటే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పడుతుందనిపిస్తోంది.'అని మనోజ్ తివారీ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 179 పరుగులు చేసింది. తెలుగు తేజం తిలక్ వర్మ(45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 65) హాఫ్ సెంచరీతో రాణించగా.. యువ ప్లేయర్ నెహాల్ వదేరా(24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 49) సత్తా చాటాడు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ 5 వికెట్లతో ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసించగా.. ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీసాడు. అశ్విన్, చాహల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 18.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 183 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.
యశస్వి జైస్వాల్(60 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్లతో 104 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. జోస్ బట్లర్(25 బంతుల్లో 6 ఫోర్లతో 35), సంజూ శాంసన్(28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 38 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో పియూష్ చావ్లాకు ఓ వికెట్ దక్కింది.