ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ తమ కెప్టెన్గా ఆస్ట్రేలియా సారథి, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను నియమించింది. దుబాయ్ వేదికగా జరిగిన మినీ వేలంలో ప్యాట్ కమిన్స్ను రూ. 20.50 కోట్ల రికార్డు ధరకు సన్రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
బౌలింగ్తో పాటు లోయరార్డర్లో మెరుపులు మెరిపించగల సామర్థ్యం ఉండటం... ఇప్పటికే సక్సెస్ఫుల్ కెప్టెన్గా గుర్తింపు పొందడంతో కమిన్స్పై కోట్లు కుమ్మరించింది. అందరూ ఊహించినట్లుగానే ఎయిడెన్ మార్క్రమ్పై వేటు వేసి కమిన్స్ను సారథిగా ప్రకటించింది.

అయితే గత నాలుగు సీజన్లుగా దారుణంగా విఫలమవుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ సారథ్య బాధ్యతలు స్వీకరిస్తు కమిన్స్కు అతిపెద్ద సవాళ్లు ఎదురవనున్నాయి. దాదాపు అతను ముళ్ల కిరీటంపైనే కూర్చుంటున్నాడు. ఫ్రాంచైజీతో పాటు అభిమానుల అంచనాలు అందుకుంటూ.. అనుభవం లేని ఆటగాళ్లతో జట్టును నడిపించాల్సి ఉంటుంది.
ముఖ్యంగా అప్కమింగ్ సీజన్లో కమిన్స్కు మూడు అతిపెద్ద సవాళ్లు ఎదురు కానున్నాయి.
1. కుర్రాళ్ల ఆత్మవిశ్వాసం పెంచడం
గత 6 సీజన్లుగా సన్రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. డేవిడ్ వార్నర్ సారథ్యంలో 2016లో టైటిల్ గెలిచిన ఆ జట్టు.. 2018లో కేన్ మామ కెప్టెన్సీలో ఫైనల్ చేరింది. ఆ తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. ప్లే ఆఫ్స్ చేరడం దేవుడెరుగు.. 2021, 2022, 2023 సీజన్లలో పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది.
గత మూడు సీజన్లలో ముగ్గురు కెప్టెన్లను మార్చినా.. కొత్త కోచ్లను తీసుకొచ్చినా ఫలితం మారలేదు. కాబట్టి కెప్టెన్గా సారథ్య బాధ్యతలు స్వీకరించే కమిన్స్ ముందున్న తొలి టాస్క్.. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచడం. గత నాలుగేళ్లుగా మిస్సైన ఫైటింగ్ స్పిరిట్ను జట్టులో ఇన్స్టాల్ చేయాలి. గెలవగలమనే నమ్మకాన్ని ఆటగాళ్లలో కల్పించాలి.
2. భారీ ప్రైజ్ట్యాగ్ ఒత్తిడిని అధిగమించాలి..
ఐపీఎల్ చరిత్రలోనే రూ. 20.50 కోట్ల రికార్డు ధర పలికిన ప్యాట్ కమిన్స్.. ఈ ప్రైజ్ ట్యాగ్ ఒత్తిడిని అధిగమించాలి. తన ఆటతో పాటు కెప్టెన్సీతో ఈ డబ్బులకు సరైన న్యాయం చేయాలి. లేకుంటే సొంత అభిమానుల నుంచే కమిన్స్ తీవ్ర విమర్శలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అయితే ఐపీఎల్లో కమిన్స్ రికార్డు గొప్పగా లేదు.
ఈ టోర్నీలో ఇప్పటి వరకు 42 మ్యాచ్లు ఆడిన కమిన్స్ 30.16 యావరేజ్, 8.54 ఎకానమీతో 45 వికెట్లు మాత్రమే తీసాడు. ఒకే ఒక్క మ్యాచ్లో నాలుగు వికెట్ల ఘనతను అందుకున్నాడు. కేకేఆర్ తరఫున అతను ఆడిన చివరి సీజన్లో 7 మ్యాచ్ల్లో 9 వికెట్లు తీసాడు. బంతితో పాటు బ్యాట్తో కమిన్స్ మెరుగైన ప్రదర్శన చేయాలి.
ఐపీఎల్లో కమిన్స్ 3 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇందులో ఒకటి 14 బంతుల్లోనే సాధించాడు. కెప్టెన్గా ఇంతకు మించిన ప్రదర్శన చేయాల్సిన బాధ్యత కమిన్స్పై ఉంది. లేకుంటే ప్రతీ బంతికి ఓ రూపాయి లెక్క కట్టి అభిమానులు ట్రోల్ చేస్తారు. మునపటిలా టైంపాస్ టోర్నీలా ఆడకుండా.. కెప్టెన్గా బాధ్యతతో ఆడాలి.
3. సరైన కాంబినేషన్ ఎంచుకోవాలి..
కెప్టెన్గా ప్యాట్ కమిన్స్ ముందున్న మరో బిగ్ టాస్క్.. సరైన టీమ్ కాంబినేషన్ ఎంచుకోవడం. గత మూడు సీజన్లలో సరైన కాంబినేషన్ లేకనే సన్రైజర్స్ విఫలమైంది. ప్రతీ మ్యాచ్కు ఓ కాంబినేషన్ను ట్రై చేయడం బెడిసి కొట్టింది.
కనీసం కమిన్స్ అయినా.. నైపుణ్యం కలిగిన ఆటగాళ్లను గుర్తించి కాంబినేషన్ను సిద్దం చేసుకోవాలి. అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఉమ్రాన్ మాలిక్ వంటి యువ ఆటగాళ్లను సరిగ్గా వాడుకోవాలి. ఐపీఎల్ 2022 సీజన్లో ఎక్స్ ఫ్యాక్టర్గా నిలిచిన ఉమ్రాన్ మాలిక్కు గత సీజన్లో తుది జట్టులో అవకాశమే ఇవ్వలేదు. స్పష్టమైన ప్రణాళికలతో కమిన్స్ ముందుకు సాగాలి. లేకుంటే గతంలో మాదిరే ఫలితాలు ఎదురవుతాయి.