ఐపీఎల్ 2024 సీజన్కు ముందు లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్జీ) కీలక నిర్ణయం తీసుకుంది. తమ టీమ్ వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి స్టార్ ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాను తప్పించింది. అతని స్థానంలో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ను వైస్ కెప్టెన్గా నియమించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా గురువారం వెల్లడించింది.
లక్నో సూపర్ జెయింట్స్ షేర్ చేసిన పోస్ట్లో కెప్టెన్ కేఎల్ రాహుల్.. నికోలస్ పూరన్కు వైస్ కెప్టెన్సీ జెర్సీని అందించిన ఫొటోను పంచుకుంది. ఈ ఫొటోకు 'కేఎల్ రాహుల్(కెప్టెన్), నికోలస్ పూరన్(వైస్ కెప్టెన్).. ఇప్పటికే ఈ సీజన్ ఎంతో ప్రత్యేకమైన అనుభూతినిస్తోంది.'అని క్యాప్షన్గా పేర్కొంది.

ఇక గత రెండు సీజన్లలో కేఎల్ రాహుల్ గైర్హాజరీలో కృనాల్ పాండ్యా జట్టును అద్భుతంగా నడిపించాడు. సూపర్ కెప్టెన్సీతో జట్టును ప్లేఆఫ్స్ చేర్చాడు. అయితే ప్రస్తుతం నికోలస్ పూరన్ సూపర్ ఫామ్లో ఉండటంతో లక్నో ఫ్రాంచైజీ అతనికి ప్రమోషన్ ఇచ్చింది. యూఏఈ టీ20 లీగ్లో ఎంఐ ఎమిరేట్స్ తరఫున బరిలోకి దిగిన నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్తో జట్టును ఛాంపియన్గా నిలబెట్టాడు.
అంతేకాకుండా ఈ సీజన్కు ముందు లక్నో ఫ్రాంచైజీ తమ జట్టును ప్రక్షాళన చేసింది. ఇప్పటికే హెడ్ కోచ్ పదవి జస్టిన్ లాంగర్కు కట్టబెట్టిన లక్నో..టీమ్ మెంటార్ గౌతమ్ గంభీర్పై కూడా వేటు వేసింది.
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తొడ కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. ఇంగ్లండ్తో తొలి టెస్ట్ మాత్రమే ఆడిన రాహుల్.. మిగతా మ్యాచ్లకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఎన్సీఏలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. అతను గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోతే ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభం మ్యాచ్లకు కూడా దూరమయ్యే అవకాశం ఉంది.
మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. రాజస్థాన్ రాయల్స్తో మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్ తొలి మ్యాచ్ ఆడనుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీసీసీఐ 22 మ్యాచ్ల షెడ్యూల్ మాత్రమే వెల్లడించింది.