ఐపీఎల్ 2024 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. సన్రైజర్స్ హైదరాబాద్తో ఉప్పల్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ముందుగా బ్యాటింగ్లో తడబడిన లక్నో సూపర్ జెయింట్స్.. అనంతరం బౌలింగ్లో తేలిపోయింది.
166 పరుగుల లక్ష్యాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ 9.4 ఓవర్లలోనే చేధించింది. ఆ జట్టు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ విధ్వంకర బ్యాటింగ్తో ఆకాశమే హద్దుగా చెలరేగారు. అయితే ఈ పరాజయంపై లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్కు హాజరైన అతను.. ఈ ఓటమిని తట్టుకోలేకపోయాడు.

మ్యాచ్ ముగిసిన అనంతరం కేఎల్ రాహుల్తో సంజీవ్ గోయెంకా సీరియస్గా చర్చించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారింది. లక్నో బ్యాటర్లు తడబడిన వికెట్పై సన్రైజర్స్ బ్యాటర్లు స్వేచ్చగా ఎలా? ఆడారని ప్రశ్నించినట్లు అర్థమవుతోంది.
ముఖ్యంగా ఈ ఓటమికి కెప్టెన్ కేఎల్ రాహుల్ను బాధ్యుడిని చేస్తూ క్లాస్ పీకినట్లు ఈ వీడియోను చూస్తే అర్థమవుతోంది. మ్యాచ్ పరిస్థితిని కేఎల్ రాహుల్ చెప్పే ప్రయత్నం చేసినా సంజీవ్ గోయెంకా వినిపించుకోలేదు. కోపంతో ఊగిపోయారు.
వారి మధ్య జరిగిన సంభాషణపై స్పష్టత లేనప్పటికీ సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంజీవ్ గోయెంకా తీరును కొందరు తప్పుబడుతుంటే మరికొందరు సరైనదేనని కామెంట్ చేస్తున్నారు. ఓ ఆటగాడిని మైదానంలో నిలదీసే హక్కు ఫ్రాంచైజీ ఓనర్లకు లేదని, ఇది చాలా దారుణమని మండిపడుతున్నారు.
క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఆటగాళ్లకు అండగా నిలవాల్సిందిపోయి నిందించడం ఏ మాత్రం సబబు కాదని విమర్శిస్తున్నారు. అయితే ఈ ఘటనతో కేఎల్ రాహుల్.. లక్నో సూపర్ జెయింట్స్ను వీడుతాడనే ప్రచారం కూడా ఊపందుకుంది. వచ్చే ఏడాది మెగా వేలం జరగనున్న నేపథ్యంలో రాహుల్.. మరో జట్టును చూసుకుంటాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఆయుష్ బదోని(30 బంతుల్లో 9 ఫోర్లతో 55), నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 48) దూకుడుగా ఆడారు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(2/12) రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ 9.4 ఓవర్లలోనే 167 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 75 నాటౌట్), ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్లతో 89 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు.