న్యూఢిల్లీ: లక్నో సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ టీమ్ మెంటార్గా సేవలందిస్తున్న టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్పై వేటు వేసేందుకు రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. రెండు సీజన్లలో టీమ్ టైటిల్ అందుకోకపోవడంతో పాటు అనవసర గొడవలతో టీమ్ ప్రతిష్టను దిగజార్చడని లక్నో ఫ్రాంచైజీ ఓనర్స్ గంభీర్పై ఆగ్రహంగా ఉన్నట్లు టీమ్ అధికారి ఒకరు తెలిపినట్లు ఓ జాతీయ చానెల్ పేర్కొంది.
'ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అభిమానులతో పాటు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీతో గంభీర్ గొడవకు దిగడంపై లక్నో మేనేజ్మెంట్ కోపంగా ఉంది. ఈ గొడవ కారణంగా లక్నో ఫ్రాంచైజీని అభిమానించేవారి కంటే ద్వేషించేవారి సంఖ్యనే ఎక్కువైంది. ఇది జట్టుకు తీరని నష్టం చేసింది.

దాంతో టీమ్ ఓనర్స్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే సోషల్ మీడియా ప్రతినిధిని మార్చారు. గంభీర్పై వేటు వేయడంపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ విషయంపై గంభీర్ను కూడా వివరణ కోరనున్నారు. ఐపీఎల్ 2024 మినీ వేలం వరకు తుది నిర్ణయం తీసుకోనున్నారు.'అని సదరు అధికారి వెల్లడించాడు.
ఇతర జట్లతో పోల్చితే లక్నో సూపర్ జెయింట్స్ ఫ్యాన్స్ బేస్ చాలా తక్కువగా ఉందని, కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా తడబడుతుండటంతో ఫ్యాన్స్ సంఖ్య పెరగడం లేదని టీమ్ ఓనర్స్ గుర్తించారంట. ఐపీఎల్ వంటి బెస్ట్ లీగ్లో కొనసాగాలంటే ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ముఖ్యమని లక్నో ఓనర్స్ భావిస్తున్నారట.
ఫ్యాన్ బేస్ను పెంచుకోవడంతో పాటు కోహ్లీ ఫ్యాన్స్ను ప్రసన్నం చేసుకోవడంలో భాగంగానే గంభీర్పై వేటు వేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గంభీర్ పని తీరుపై కూడా టీమ్మేనేజ్మెంట్ ఆగ్రహంగా ఉందంట. కోచ్ ఆండీ ఫ్లవర్కు కూడా గంభీర్తో సఖ్యత లేదని, అతనే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని టీమ్ ఓనర్స్కు ఫిర్యాదు చేశాడట.
మరోవైపు గంభీర్ కూడా ఐపీఎల్ 2024కు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అతను ప్రజల మధ్య ఉండాలని నిర్ణయించుకున్నాడని అతని సన్నిహితులు తెలిపినట్లు ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా, విరాట్ కోహ్లీ వ్యాపార భాగస్వాములని, ఈ ఇద్దరూ కలిసి పెట్టుబడులు పెట్టారని ఆర్సీబీ ఫ్యాన్స్ అంటున్నారు.
కోహ్లీతో సఖ్యత చెడకుండా ఉండేందుకు గంభీర్ను దూరం పెట్టాలని సంజీవ్ గోయెంకా భావిస్తున్నడని ఆర్సీబీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా బెంగళూరు వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో గంభీర్.. ఆర్సీబీ ఫ్యాన్స్ను నోరు మూసుకోమని సైగలు చేస్తూ కయ్యానికి కాలు దువ్వాడు.

లక్నో ట్విటర్ అకౌంట్ కూడా ఆర్సీబీ పరాజయాన్ని హేళన చేసింది. వీటిని మనసులో పెట్టుకున్న ఆర్సీబీ ఆటగాళ్లు లక్నో మైదానం వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో బదులిచ్చారు. ఈ క్రమంలో లక్నో పేసర్ నవీన్ ఉల్ హక్.. కోహ్లీ మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. గంభీర్ జోక్యం చేసుకోవడంతో అత్యంత వివాదాస్పద ఘటనగా మారిపోయింది.
లక్నో ఫ్రాంచైజీ ట్విటర్ వేదికగా రాజీకి వచ్చినా ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు. దాంతో ఇరు జట్ల మధ్య పోరు.. భారత్-పాక్లా మారిపోయింది.