న్యూఢిల్లీ: టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్, మాజీ వికెట్ కీపర్ ఎమ్మెస్కే ప్రసాద్కు లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్జీ) కీలక పదవి ఇచ్చింది. అప్కమింగ్ ఐపీఎల్ 2024 సీజన్ కోసం ఎమ్మెస్కేను లక్నో వ్యూహాత్మక సలహాదారుడిగా నియమించుకుంది. ఈ మేరకు లక్నో సూపర్ జెయింట్స్ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటనను విడుదల చేసింది.
టీమిండియా చీఫ్ సెలెక్టర్గా క్రికెట్ ఆపరేషన్స్లో అపారమైన అనుభవం కలిగిన ఎమ్మెస్కే ప్రసాద్ సేవలు తమ ఫ్రాంచైజీకి చాలా ఉపయోగపడుతాయని పేర్కొంది. చీఫ్ సెలెక్టర్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేటర్గా ఎమ్మెస్కే ప్రసాద్కు ఘనమైన రికార్డు ఉందని, ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రతిభ కలిగిన ఆటగాళ్లను గుర్తించడంలో అతనికి సాటిలేరని ప్రశంసించింది.

ముఖ్యంగా ఆంధ్రలో క్రికెట్ అడ్మినిస్ట్రేటర్గా అతను చేసిన పనులు అద్భుతమని, 13 జిల్లాల్లో కోచింగ్ ఫెసలిటిస్ కల్పించడం గొప్ప విషయమని కొనియాడింది. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున కూడా ఎమ్మెస్కే అవే బాధ్యతలు నిర్వర్తించబోతున్నాడని, దేశవ్యాప్తంగా ప్రతిభాన్వేషణ చేపట్టి జట్టుకు కావాల్సిన ఆటగాళ్లను తీసుకొస్తాడని ధీమా వ్యక్తం చేసింది.
ఇటీవలే లక్నో సూపర్ జెయింట్స్ ఆసీస్ దిగ్గజం జస్టిన్ లాంగర్ను తమ హెడ్ కోచ్గా నియమించుకుంది. రెండేళ్ల పాటు హెడ్ కోచ్గా సేవలందించిన ఆండీ ఫ్లవర్కు ఉద్వాసన పలికింది. ఇంతలోనే ఎమ్మెస్కేను వ్యూహాత్మక సలహాదారుడిగా నియమించుకుంది. అప్కమింగ్ సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ పకడ్బందీగా సిద్దమవుతోంది.
ఎమ్మెస్కే ప్రసాద్ భారత్ తరఫున 17 టెస్ట్లు ఆడాడు. 2016-2020 వరకు భారత సెలెక్టర్గా.. చీఫ్ సెలెక్టర్గా వ్యవహరించారు. ఐపీఎల్ 2024 సీజన్ కోసం ఫ్రాంచైజీలన్నీ పకడ్బందీ ప్రణాళికలు రచిస్తున్నాయి.