ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ స్టార్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వల్ల నిద్రలేని రాత్రులు గడిపానని కోల్కతా నైట్రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. ముంబై ఇండియన్స్తో మ్యాచ్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడిన గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా ఐపీఎల్ కెప్టెన్గా తనను భయపెట్టిన బ్యాటర్ గురించి వెల్లడించాడు.
'క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ కాదు. ఐపీఎల్లో కెప్టెన్గా ఉన్నప్పుడు నన్ను భయపెట్టిన ఒకే ఒక్క బ్యాటర్ రోహిత్ శర్మ. అతను బరిలో ఉన్నాడంటే నేను ప్లాన్-ఏ, ప్లాన్ బీ, ప్లాన్ సీ కూడా సిద్దం చేసుకునేవాడిని.

ఎందుకంటే రోహిత్ శర్మను ఆపడం అంత సులువైన పనికాదు. అందుకే అతడి కోసం ప్రత్యేకమైన ప్రణాళికలను సిద్దం చేసుకునేవాడిని. ఒక్కోసారి రాత్రుళ్లు నిద్రపోకుండా వ్యూహాలు రచించిన ఘటనలు కూడా ఉన్నాయి.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్ సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో వైరల్గా మారింది.
భారత్ తరఫున రెండు ప్రపంచకప్లు గెలిచిన గౌతమ్ గంభీర్.. ఐపీఎల్లోనూ సక్సెస్ఫుల్ కెప్టెన్గా గుర్తింపు పొందాడు. కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు సుదీర్ఘ కాలం ఆడిన గంభీర్.. 2012, 2014 సీజన్లలో సారథిగా టైటిళ్లు అందించాడు. కెరీర్ చివరి దశలో ఢిల్లీ క్యాపిటల్స్కు మారిన గంభీర్.. ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో వీడ్కోలు పలికాడు.
అనంతరం రాజకీయాల్లోకి వెళ్లిన అతను.. బీజేపీ ఎంపీగా గెలుపొందాడు. 2022 సీజన్తో మళ్లీ ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన గంభీర్.. గతేడాది వరకు లక్నోసూపర్ జెయింట్స్ మెంటార్గా వ్యవహరించాడు. ఈ సీజన్కు ముందు మళ్లీ కేకేఆర్ గూటికి చేరిన అతను.. సక్సెస్ఫుల్గా టీమ్ను నడిపిస్తున్నాడు.
ఈ సీజన్లో ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన కేకేఆర్ 6 విజయాలతో పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ముంబై ఇండియన్స్ 10 మ్యాచ్ల్లో ఏడింటిలో ఓడి 9వ స్థానంలో నిలిచింది. మరికాసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో ఓడితే ముంబై అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటుంది.