ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో కేకేఆర్ 158 పరుగుల లక్ష్యాన్ని నమోదు చేసింది. వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్ మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. దాంతో ఓవర్లను 16కు కుదించి అంపైర్లు ఆటను కొనసాగించారు. వెంకటేశ్ అయ్యర్(21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 42), నితీష్ రాణా(23 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 33) దూకుడుగా ఆడారు.
దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో పియూష్ చావ్లా, బుమ్రా రెండేసి వికెట్లు తీయగా.. నువాన్ తుషారా,అన్షుల్ కంబోజ్ తలో వికెట్ పడగొట్టారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కేకేఆర్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. నువాన్ తుషారా వేసిన తొలి ఓవర్లోనే ఓపెనర్ ఫిల్ సాల్ట్ క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ మరుసటి ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా వేసిన స్టన్నింగ్ డెలివరీకి సునీల్ నరైన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమైన అతను బుమ్రా స్టన్నింగ్ ఇన్స్వింగర్కు వెనుదిరిగాడు.
దాంతో కేకేఆర్ 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. వెంకటేశ్ అయ్యర్ ధాటిగా ఆడగా.. అయ్యర్ ఆచితూచి ఆడాడు. అయితే అయ్యర్(7)ను అన్షుల్ కంబోజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో పవర్ ప్లేలో కేకేఆర్ 3 వికెట్లకు 45 పరుగులే చేసింది.
నితీష్ రాణాతో కలిసి వెంకటేశ్ అయ్యర్ చెలరేగాడు. దూకుడుగా ఆడిన ఈ ఇద్దరూ.. నాలుగో వికెట్కు 37 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. హాఫ్ సెంచరీకి చేరువైన వెంకటేశ్ అయ్యర్(42)ను పియూష్ చావ్లా క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆండ్రీ రస్సెల్తో కలిసి ధాటిగా ఆడిన నితీష్ రాణా స్కోర్ బోర్డును పరుగెత్తించాడు.
అయితే అతను తిలక్ వర్మ సూపర్ త్రోకు నితీష్ రాణా(33) రనౌటయ్యాడు. ఆండ్రీ రస్సెల్(24)ను చావ్లా ఔట్ చేయగా.. రింకూ సింగ్(18), రమణ్దీప్ సింగ్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ బుమ్రా వేసిన ఆఖరి ఓవర్లో రింకూ సింగ్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. క్రీజులోకి మిచెల్ స్టార్క్ రాగా.. రమణ్దీప్ సింగ్ ఆఖరి బంతికి సిక్సర్ బాది జట్టు స్కోర్ను 157 ధాటించాడు.