స్లోయర్ బాల్స్తో లక్నో సూపర్ జెయింట్స్ను ఓడించామని కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో సమష్టిగా చెలరేగిన కేకేఆర్ 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన శ్రేయస్ అయ్యర్.. ఈ జోరును కొనసాగించే ప్రయత్నం చేస్తానని చెప్పాడు. 'ఇదో సమష్టి విజయం. ఫీల్డింగ్, బౌలింగ్లో సత్తా చాటాం. ఉక్కపోత వాతావరణం, పొడిగా ఉన్న వికెట్పై వీలైనంత వరకు స్లోయర్ బాల్స్ వేయడం చాలా ముఖ్యం. ఈ ప్రణాళికతోనే మేం లక్నోను కట్టడి చేశాం.

మాకు వికెట్లు దక్కినప్పుడు పరిస్థితులు మరింత అడ్వాంటేజ్గా అనిపించాయి. మరింత అటాకింగ్ ఫీల్డ్ పెట్టాం. మా బౌలర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. ఐపీఎల్ అనేది చాలా గమ్మత్తయిన టోర్నీ. అతిగా ఆలోచించకుండా ప్రస్తుతంలో జీవిస్తూ ముందుకు సాగాలి. ఏ మాత్రం ఎమరపాటుగా ఉన్న అవకాశాలు చేజారుతాయి.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 39), నికోలస్ పూరన్(32 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 45)టాప్ స్కోరర్లుగా నిలిచారు.
కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. వైభవ్ అరోరా, నరైన్, చక్రవర్తీ, రస్సెల్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 15.4 ఓవర్లలోనే 2 వికెట్లకు 162 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. ఫిలిప్ సాల్ట్(47 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లతో 89 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(38 బంతుల్లో 6 ఫోర్లతో 38 నాటౌట్) సత్తా చాటాడు. లక్నో బౌలర్లలో మోహ్సిన్ ఖాన్ రెండు వికెట్లు తీసాడు.