ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు.
అయితే తుది జట్టు చేసిన మార్పులు చెప్పడానికి అయ్యర్ తడబడ్డాడు. జట్టులోకి వచ్చే ఆటగాళ్ల పేర్లు మరిచిపోయానని తెలిపాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి.
'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. ఈ పిచ్ గురించి క్యూరెట్తో మాట్లాడాం. వికెట్పై స్పిన్ లభిస్తుందని చెప్పారు. ఇది మాకు కలిసొచ్చే అంశం. జట్టు ప్రతీ ఒక్కరు మంచి ఉత్సాహంతో ఉన్నారు. గత విజయం జోరును మేం కొనసాగించాలనుకుంటున్నాం. అయితే అందరూ అతిగా ఆలోచించకుండా ఉండటం చాలా ముఖ్యం.

యాంకర్ రోల్ ఆడటం నా పాత్ర. సూపర్ బౌలింగ్ లైనప్ కలిగి ఉండటం ఎప్పుడైనా కలిసొచ్చే అంశం. ఆరంభంలోనే పిచ్ అడ్వాంటేజ్ను వాడుకుంటాం. జట్టులో కొన్ని మార్పులు చేశాం. అనుకుల్ జట్టులోకి వచ్చాడు. మరో ఇద్దరికి అవకాశం ఇచ్చాం. వారి ఎవరా? అనేది మరిచిపోయాను.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
నితీష్ రాణా ఈ మ్యాచ్కు దూరం కాగా.. సుయాష్ శర్మ స్థానంలో అనుకుల్ రాయ్ వచ్చాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు అంగ్క్రిష్ రఘువంశీ కేకేఆర్ అరంగేట్ర క్యాప్ అందుకున్నాడు. అతను ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ పేర్లనే అయ్యర్ చెప్పలేకపోయాడు. ఇంపాక్ట్ రూల్స్ కారణంగా అతను అయోమయానికి గురయ్యాడు.
మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బౌలింగ్ చేసేవాళ్లమని ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. 'మేం కూడా బౌలింగ్ చేయాలనుకున్నాం. ఇది చాలా ఫ్రెష్ వికెట్. తొలి ఇన్నింగ్స్లో ఎలా ఉంటుందో గత మ్యాచ్లో చూశాం. ఈ సీజన్ ఆరంభంలోనే హోరాహోరీ మ్యాచ్లు జరగడం ముఖ్యమైన విషయం.
క్రికెటర్లంతా పరిస్థితులను అందిపుచ్చుకొని ఆడటం ముఖ్యం. ఆర్సీబీ అభిమానుల మద్దతు.. ఇక్కడి వాతావరణం మాకు కలిసొచ్చే అంశం. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాం.
తుది జట్లు:
కేకేఆర్: ఫిలిప్ సాల్ట్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రమణ్దీప్ సింగ్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ
ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, రజత్ పటీదార్, గ్లేన్ మ్యాక్స్వెల్, అనూజ్ రావత్, దినేశ్ కార్తీక్, అల్జారీ జోసెఫ్, మయాంక్ దగార్, యశ్ దయాల్, మహమ్మద్ సిరాజ్