కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) చరిత్ర సృష్టించింది. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే నాకౌట్ మ్యాచ్ల్లో అత్యధిక బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకున్న తొలి జట్టుగా నిలిచింది. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఆదివారం చెన్నై వేదికగా జరిగిన ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ను 8 వికెట్ల తేడాతో కేకేఆర్ చిత్తు చేసింది.

సన్రైజర్స్ హైదరాబాద్ విధించిన 114 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 10.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేధించింది. దాంతో 57 బంతులు మిగిలి ఉండగానే కేకేఆర్ విజయం సాధించి ముచ్చటగా మూడోసారి ఛాంపియన్గా నిలిచింది. తద్వారా నాకౌట్స్లో అత్యధిక బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించిన తొలి జట్టుగా కేకేఆర్ చరిత్రకెక్కింది. కేకేఆర్కు ఇది బంతుల పరంగా రెండో అతి పెద్ద విజయం.

ఈ సీజన్లో కేవలం మూడు మ్యాచ్ల్లోనే ఓటమిపాలైన కేకేఆర్.. ఓ సీజన్లో అతి తక్కువ పరాజయాలు నమోదు చేసిన జట్టుగా చరిత్రకెక్కింది. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ రికార్డును సమం చేసింది. అరంగేట్ర ఐపీఎల్ 2008 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ 3 మ్యాచ్ల్లోనే ఓటమిపాలైంది. తాజా సీజన్లోనూ కేకేఆర్ మూడు పరాజయాలే నమోదు చేసి ఆ రికార్డును సమం చేసింది. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ నాలుగు మ్యాచ్ల్లో మాత్రమే ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు కుప్పకూలింది. ఎయిడెన్ మార్క్రమ్(23 బంతుల్లో 3 ఫోర్లతో 20), ప్యాట్ కమిన్స్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా రెండేసి వికెట్లు తీయగా.. ఆండ్రీ రస్సెల్(3/19) మూడు వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తీ, సునీల్ నరైన్ తలో వికెట్ తీసారు. ఐపీఎల్ చరిత్రలోనే ఫైనల్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా సన్రైజర్స్ చెత్త రికార్డ్ నమోదు చేసింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 10.3 ఓవర్లలో 2 వికెట్లకు 114 పరుగులు చేసి 57 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. సునీల్ నరైన్(6) విఫలమైనా.. రెహ్మానుల్లా గుర్బాజ్(32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 39), వెంకటేశ్ అయ్యర్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 52 నాటౌట్) సత్తా చాటారు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్, షెహ్బాజ్ అహ్మద్ తలో వికెట్ తీసారు. ఈ టోర్నీ ఆసాంతం కేకేఆర్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది.