విజయానందంలో ఉన్న కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్)కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర ఆల్రౌండర్, తొలి మ్యాచ్ విన్నర్ ఆండ్రూ రస్సెల్ తదుపరి మ్యాచ్ ఆడటం సందేహంగా మారింది. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో కేకేఆర్ 4 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
ఆండ్రూ రస్సెల్ విధ్వంసకర బ్యాటింగ్తో కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్లో ఆండ్రూ రస్సెల్ గాయపడినట్లు తెలుస్తోంది. ఫీల్డింగ్ సమయంలో అతను కాస్త అస్వస్థతకు గురయ్యాడని కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. ఆఖరి ఓవర్ రస్సెల్తో కాకుండా హర్షిత్ రాణాతో ఎందుకు వేయించావ్? అనే ప్రశ్నకు సమాధానంగా అతని గాయం వివరాలను వెల్లడించాడు.

ఫీల్డింగ్ సందర్భంగా కడుపు నొప్పితో ఇబ్బంది పడిన ఆండ్రూ రస్సెల్.. 17వ ఓవర్లోనే మైదానం వీడాడని అయ్యర్ తెలిపాడు. దాంతోనే తాను ఆఖరి ఓవర్ను హర్షిత్ రాణాతో వేయించాల్సి వచ్చిందని చెప్పాడు. హెన్రీచ్ క్లాసెన్ దెబ్బకు 19వ ఓవర్లో మిచెల్ స్టార్క్ 26 పరుగులు సమర్పించుకోవడంతో అయ్యర్కు హర్షిత్ రాణా మినహా మరో బౌలింగ్ ఆప్షన్ లేకుండా పోయింది.
ఆండ్రూ రస్సెల్ అస్వస్థతకు గల కారణాన్ని కేకేఆర్ వెల్లడించలేదు. ఫుడ్ పాయిజన్ సమస్యనా..? లేక ఉదర సంబంధిత నరాలు పట్టేసాయా? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మ్యాచ్ల్లో 25 బంతుల్లో 64 పరుగులు చేసిన రస్సెల్.. బౌలింగ్లో 2 వికెట్లు కూడా తీసాడు. ఈ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
అయితే రస్సెల్ కడుపునొప్పి ఉక్కపోత వాతావరణం కారణంగా వచ్చిందేనని, అంత సీరియస్ ఏం కాదని కేకేఆర్ వర్గాలు పేర్కొన్నాయి. మార్చి 29న ఆర్సీబీతో జరిగే తదుపరి మ్యాచ్కు అతను అందుబాటులోకి వస్తాడని కేకేఆర్ టీమ్కు చెందిన ఓ అధికారి వెల్లడించాడు.