సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన ఆరోపణలు చేశారు. సన్రైజర్స్ హైదరాబాద్కు డేవిడ్ వార్నర్ కెప్టెన్గా ఉన్నప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్లకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ విషయంపై తాను సన్రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశానని చెప్పారు.
తన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన సన్రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్ను జట్టు నుంచి తొలిగించిందని తెలిపారు. దానం నాగేందర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్గా మారాయి. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఉప్పల్ వేదికగా శుక్రవారం జరగనుంది.

బ్లాక్ టికెట్లపై..
ఈ మ్యాచ్ టికెట్ల కోసం సాధారణ క్రికెట్ అభిమానుల నుంచి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖలు ఆసక్తి కనబర్చారు. ఈ డిమాండ్ను కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశారు. బ్లాక్ మార్కెట్కు తెరలేపారు. ఈ టికెట్ల అమ్మకంపై ఓ తెలుగు టీవీ చానెల్తో మాట్లాడిన దానం నాగేందర్ సంచలన ఆరోపణలు చేశారు.
సన్రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్తో పాటు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావులపై విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్ మార్కెట్లో టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు. బ్లాక్ మార్కెట్ దందాపై ముఖ్యమంత్రి, క్రీడా మంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.
కాంప్లమెంటరీ పాస్లు అమ్ముకుంటున్నారు..
హెచ్సీఏ కాంప్లమెంటరీ పాస్లను కూడా బ్లాక్లో అమ్ముతున్నారని ఆరోపించారు. హెచ్సీఏ తీరుపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ హైదరాబాద్ క్రికెటర్లకు అవకాశం ఇవ్వకుంటే వచ్చే సీజన్ నుంచి ఉప్పల్ వేదికగా ఒక్క మ్యాచ్ కూడా ఆడనివ్వమని, తానే స్వయంగా అడ్డుకుంటానని హెచ్చరించారు.
హెచ్సీఏలో పెత్తనం చెలాయిస్తున్న కిరణ్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలన్నారు. 10 నిముషాల్లో 45 వేల టికెట్స్ ఎలా అమ్ముడుపోతాయని ప్రశ్నించారు. టికెట్స్ అమ్మకాలు పారదర్శకంగా జరగాలని సూచించారు. వచ్చే మ్యాచ్ల్లో బ్లాక్ టికెట్స్ దందా జరగకుండా చూడాలన్నారు.
డేవిడ్ వార్నర్పై దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై అతని అభిమానులు ఘాటుగా స్పందిస్తున్నారు. ఉప్పల్ మ్యాచ్ టికెట్లు ఇవ్వలేదనే ఆక్రోషంతో దానం నాగేందర్ ఏది పడితే అది మాట్లాడుతున్నారని, వినేవాడు ఉంటే ధోనీ కూడా ఫిక్సర్ అని చెబుతారని మండిపడుతున్నారు.