IPL 2024 Auction: ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలం నేపథ్యంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆ జట్టును వీడి ముంబై ఇండియన్స్ గూటికి చేరడం తీవ్ర చర్చనీయాంశం కాగా.. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన ఐపీఎల్ జట్టును వీడుతున్నాడనే వార్తలు కలకలం రేపాయి.
హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్లోకి రావడంతో ఆ జట్టును వీడేందుకు జస్ప్రీత్ బుమ్రా సిద్దమయ్యాడనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా జస్ప్రీత్ బుమ్రా ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. జస్ప్రీత్ బుమ్రా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.

'కొన్నిసార్లు మౌనంగా ఉండటమే సరైన సమాధానం'అనే కొటేషన్ను షేర్ చేయడం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్, ట్విటర్ వేదికగా ముంబై ఇండియన్స్ పేజీలను అన్ఫాలో చేయడం, ఆర్సీబీ పేజీని ఫాలో అవుతుండటం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చుంది. ట్రేడింగ్ విండో ద్వారా జస్ప్రీత్ బుమ్రా.. ఆర్సీబీలోకి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆర్సీబీ.. జోష్ హజెల్వుడ్ను వదిలేసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఏది ఏమైనా ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఊహకు అందకుండా ఉన్నాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రేడింగ్ విండోకు డిసెంబర్ 12 వరకు గడువు ఇవ్వడం.. క్యాష్ డీల్కు ఆస్కారం ఉండటంతో ఆయా ఫ్రాంచైజీలు భారీ ఆఫర్లతో ఆటగాళ్లకు గాలం వేస్తున్నాయి.
ముంబై ఇండియన్స్ భవిష్యత్తు సారథ్యంపై ఆశలు పెట్టుకున్న జస్ప్రీత్ బుమ్రా.. హార్దిక్ పాండ్యా రాకతో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అతని రాకతో కెప్టెన్సీ అవకాశాలు మూసుకుపోయాయని భావించిన బుమ్రా.. ఆర్సీబీలోకి వెళ్లేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.