ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో గురువారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమష్టిగా చెలరేగిన ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
బౌలింగ్లో జస్ప్రిత్ బుమ్రా(5/21) నిప్పులు చెరగగా.. బ్యాటింగ్లో ఇషాన్ కిషన్(34 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 69), సూర్యకుమార్ యాదవ్(19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 52) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్(40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 61), రజత్ పటీదార్(26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 50), దినేశ్ కార్తీక్(23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 53 నాటౌట్)హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(5/21) కు తోడుగా.. గెరాల్డ్ కోయిట్జీ, ఆకాశ్ మధ్వాల్, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీసారు.
హార్దిక్ విన్నింగ్ షాట్..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ 15.3 ఓవర్లలో 3 వికెట్లకు 199 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఇషాన్, సూర్యతో పాటు రోహిత్ శర్మ(24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 38)ధాటిగా ఆడాడు. తెలుగు తేజం తిలక్ వర్మ(16 నాటౌట్), హార్దిక్ పాండ్యా(21 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశారు.
కొంపముంచిన సిరాజ్..
ఆర్సీబీ బౌలర్లలో ఆకాశ్ దీప్, విజయ్కుమార్ వైశాఖ్, విల్ జాక్స్ తలో వికెట్ తీసారు. మహమ్మద్ సిరాజ్(0/37) పేలవ ప్రదర్శన ఆర్సీబీ కొంపముంచింది. బౌలర్ల దారుణ వైఫల్యంతో కనీస పోటీ ఇవ్వలేకపోయింది. డ్యూ రావడంతో పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా మారగా.. ఆర్సీబీ బౌలర్ల చెత్త బౌలింగ్ ముంబై బ్యాటర్లకు మరింత కలిసొచ్చింది.
ఎంతో అనుభవం కలిగిన సిరాజ్.. ఈ సీజన్లో దారుణంగా విఫలమవుతున్నాడు. మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అతను 37 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో 2 ఫోర్లు, 4 సిక్స్లు సమర్పించుకున్నాడు. సిరాజ్ వేసిన రెండో ఓవర్లో ఇషాన్ కిషన్.. వరుసగా 6, 4, 6, 1, 6 బాది 23 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్ ఆర్సీబీ పోరాట పటిమను దెబ్బతీసింది.
ఈ టోర్నీలో ఆర్సీబీకి ఇది ఐదో పరాజయం. ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడిన ఆ జట్టు ఒకే ఒక్క మ్యాచ్లో విజయం సాధించింది.