IPL 2024 Auction: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ను హార్దిక్ పాండ్యా వీడుతున్నాడనే వార్తలపై పఠాన్ ఘాటుగా స్పందించాడు. హార్దిక్ పాండ్యాది యూజ్ అండ్ త్రో పాలసీ అని విమర్శించాడు.
ఇక హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టును వీడి తన పాత ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ గూటికి చేరుతున్నాడనే వార్తలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. క్యాష్ ట్రేడింగ్లో భాగంగా గుజరాత్ టైటాన్స్కు రూ. 15 కోట్లు చెల్లించి హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ డీల్పై గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు అయితే ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్ ఒకటి ఇరు జట్ల పరస్పర అంగీకారంతోని ఈ క్యాష్ ట్రేడింగ్ డీల్ పూర్తయిందని ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ వార్తలను ఇరు జట్లు ఖండించకపోవడంతో నిజమేననే అభిప్రాయం కలుగుతోంది.
గుజరాత్ టైటాన్స్ను వీడినందుకు హార్దిక్ పాండ్యాకు భారీ డబ్బుతో పాటు కొన్ని వ్యాపార ప్రకటన ఒప్పందాలను ఆఫర్గా ముంబై ఇండియన్స్ ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. గుజరాత్ టైటాన్స్కు కూడా రూ. 15 కోట్లతో పాటు తెర చాటు భారీ ఆఫర్ ఇచ్చిందని, పూర్తిగా ఇది వ్యాపార కోణంలో జరిగిన ఒప్పందమని ఐపీఎల్ వర్గాలు పేర్కొంటున్నాయి.
గుజరాత్ టైటాన్స్ను హార్దిక్ పాండ్యా వీడుతున్నాడనే వార్తల నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశాడు. 'యూజ్ అండ్ త్రో అనేది ప్రారంభం నుంచి ఉన్న నిజమైన లక్షణం'అని పేర్కొన్నాడు. ఇక్కడ హార్దిక్ పాండ్యా, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్.. చివరకు ఐపీఎల్ పేరు కూడా పఠాన్ మెన్షన్ చేయలేదు.
కానీ హార్దిక్ జట్టును వీడుతున్నాడనే వార్తలు వచ్చినప్పుడే ఈ ట్వీట్ చేయడంతో అతన్ని ఉద్దేశించే పఠాన్ ఈ ట్వీట్ చేశాడనే విషయం అర్థమవుతోంది. హార్దిక్ పాండ్యా మొదటి నుంచి యూజ్ అండ్ త్రో లక్షణం ఉన్న ఆటగాడేనని పఠాన్ పరోక్షంగా కామెంట్ చేశాడు.
పఠాన్ ట్వీట్పై నెటిజన్లు కూడా అదే శైలిలో స్పందిస్తున్నారు. ఈ ఒప్పందం చాలా దారుణమని కామెంట్ చేస్తున్నారు. కెప్టెన్గా ఒకసారి టైటిల్, మరోసారి రన్నరప్గా నిలబెట్టి, తమ ఫ్రాంచైజీకి ముఖచిత్రంగా ఉన్న ఆటగాడిని గుజరాత్ టైటాన్స్ ఎలా వదులుకుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇది కోట్ల రూపాయల చీకటి ఒప్పందమని ఆరోపిస్తున్నారు.
ఒకవేళ హార్దిక్ పాండ్యానే ముంబై ఇండియన్స్తో ఒప్పందం కుదుర్చుకుంటే అది ఐపీఎల్ రూల్స్ విరుద్దమని, గతంలో రవీంద్ర జడేజా ఇలానే ఇతర ఫ్రాంచైజీలతో సంప్రదింపు జరిపినందుకు ఏడాది పాటు నిషేధించారని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. గుజరాత్ టైటాన్స్తో పాటు హార్దిక్ పాండ్యాకు భారీ ముడుపులు ముట్టాయనే విషయం అర్థమవుతోందని కామెంట్ చేస్తున్నారు. ట్రేడింగ్ విండోతో పాటు రిలీజ్, రిటైన్ ఆటగాళ్ల జాబితాలను సమర్పించేందుకున్న గడువు ఆదివారం ముగియనుంది.