రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్కు భారత క్రికెటర్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రమోషన్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. గతేడాదిగా దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న ఈ అస్సాం కుర్రాడు టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఎంపిక చేసే భారత జట్టులో చోటు దక్కించుకునేందుకు అడుగు దూరంలో నిలిచాడు.
ఐపీఎల్ 2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున నిలకడగా రాణిస్తున్న ఈ కుర్రాడిపై అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ ఓ కన్నేసినట్లు తెలుస్తోంది. మిడిలార్డర్లో నిలకడగా ఆడుతూ.. ఫియర్లెస్ గేమ్ ఆడుతున్న రియాన్ పరాగ్ బ్యాటింగ్ను సెలెక్టర్ల బృందం ప్రత్యేకంగా పరిశీలిస్తున్నట్లు ఓ అధికారి మీడియాకు తెలిపారు.

సీజన్ పూర్తయ్యేవరకు రియాన్ పరాగ్ ఇలానే రాణిస్తే.. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉందని కూడా సదరు అధికారి వెల్లడించాడు. ముఖ్యంగా జట్టు అంతా విఫలమైన వేళ రియాన్ పరాగ్ చేసిన ఒంటరి పోరాటానికి సెలెక్టర్లు ఫిదా అయ్యారని సమాచారం.
ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఆర్సీబీతో మినహా ప్రతీ మ్యాచ్లో రియాన్ పరాగ్ సత్తా చాటాడు. వరుసగా 43, 84*, 54*, 4, 76, 23, 34 పరుగులతో సత్తా చాటాడు. ఏడు మ్యాచ్ల్లో 318 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
బ్యాటింగ్తో పాటు బౌలింగ్ చేయగల సామర్థ్యం, చురుకైన ఫీల్డర్ కావడంతో రియాన్ పరాగ్ను టీ20 ప్రపంచకప్ జట్టులోకి తీసుకోవాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతీ సీజన్లో బిల్డప్ బాబాయ్ అంటూ ట్రోల్స్ ఎదుర్కొనే రియాన్ పరాగ్.. ఈ సీజన్లో మాత్రం ఆరెంజ్ క్యాప్ కోసం కోహ్లీతో పోటీ పడుతున్నాడు.
జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానుంది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు వెస్టిండీస్ ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. లీగ్ మ్యాచ్లు అమెరికాలో జరగనుండగా.. కీలక మ్యాచ్లు వెస్టిండీస్ వేదికగా జరగనున్నాయి. మే తొలి వారంలో భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది.