IPL 2024: అందరూ ఊహించినట్లుగానే టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్లో జట్టును మారాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీతో పాటు ఆ జట్టును వదిలి ముంబై ఇండియన్స్ గూటికి చేరాడు. గత రెండేళ్లుగా గుజరాత్ టైటాన్స్కు సారథ్యం వహించిన హార్దిక్ పాండ్యా.. అరంగేట్ర సీజన్లోనే టైటిల్ అందించాడు. ఈ ఏడాది ఫైనల్కు చేర్చాడు.
అలాంటిది హార్దిక్ పాండ్యా ఉన్నపళంగా గుజరాత్ టైటాన్స్ను వదిలి ముంబై ఇండియన్స్లోకి చేరడం చర్చనీయాంశమైంది. ఒకసారి టైటిల్తో పాటు మరోసారి రన్నరప్గా నిలబెట్టిన హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ ఎందుకు వదులుకుంది? అతని కోసం ముంబై ఇండియన్స్ ఎందుకు ఆసక్తికనబర్చింది? అనే ప్రశ్నలు ప్రతీ క్రికెట్ అభిమానికి రేకెత్తుతున్నాయి.

అది కూడా ఎన్నడూ వినని క్యాష్ ట్రేడ్ డీల్ ద్వారా ఈ మార్పు జరగడం అనేక సందేహాలకు తావిస్తోంది. 2015లో ముంబై ఇండియన్స్తో ఐపీఎల్ కెరీర్ మొదలు పెట్టిన హార్దిక్ పాండ్యా 2021 వరకూ ఆ జట్టుకే ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి ముందు నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉండటంతో ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ వదిలేసింది. దాంతో లీగ్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. అతన్ని రూ.15 కోట్లకు తీసుకొని కెప్టెన్ను చేసింది.
అప్పుడు వద్దనుకున్న హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ పట్టుబట్టి తీసుకున్నట్లు కనిపిస్తోంది. రోహిత్ శర్మకు వారసుడిగా హార్దిక్ పాండ్యాను ప్రకటించే ఉద్దేశంతోనే ముంబై ఇండియన్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 37 ఏళ్ల వయసులో ఉన్న రోహిత్ శర్మ.. ఇంకా ఎన్ని సీజన్లు ఆడుతాడో అన్నదానిపై క్లారిటీ లేదు. పైగా గత రెండు సీజన్లుగా అతను దారుణంగా విఫలమయ్యాడు.
అంతేకాకుండా టీమిండియా టీ20 కెప్టెన్గా హార్దిక్ పాండ్యా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ పర్యవేక్షణలోనే హార్దిక్ పాండ్యాను తమ తదుపరి కెప్టెన్ చేయాలని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ చర్చించిన తర్వాతనే.. అతను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే హార్దిక్ పాండ్యాను తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కుదిరితే ఐపీఎల్ 2024 సీజన్లోనే హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు కట్టబెట్టనున్నారు. లేదంటే ఐపీఎల్ 2025లో సారథ్యం స్వీకరించడం ఖాయం. హార్దిక్ పాండ్యా జట్టులోకి రావడం వల్ల ముంబై ఇండియన్స్ జట్టుకు మంచి సమతూకం రానుంది. హార్దిక్ పాండ్యా తరహా టీమిండియా పేస్ ఆల్రౌండర్ మరొకరు లేకపోవడం.. అతనికి కలిసొచ్చే అంశం.