ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న తమ చివరి లీగ్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వాంఖడే మైదానం ఛేజింగ్కు అనుకూలంగా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా తెలిపాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. వాంఖడే మైదానం ఛేజింగ్కు అనుకూలంగా ఉంటుంది. సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా మారుతోంది. ముంబై ఇండియన్స్ గౌరవం కోసమే ఆడుతున్నాం. ప్రస్తుతం మా పరిస్థితి ఏంటో జట్టులో ఉన్న ప్రతీ ఒక్కరికి తెలుసు. మెరుగైన స్థానంలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నాం.

మంచి క్రికెట్ ఆడుతూ ఈ సీజన్ను ముగించాలనుకుంటున్నాం. ఈ మ్యాచ్లో మేం మరింత స్వేచ్చగా ఆడవచ్చు. తుది జట్టులో కొన్ని మార్పులు చేశాం. జస్ప్రీత్ బుమ్రా స్థానంలో అర్జున్ టెండూల్కర్, తిలక్ వర్మ స్థానంలో డెవాల్డ్ బ్రెవిస్ ఆడుతున్నారు. టీమ్ డేవిడ్ కూడా ఈ మ్యాచ్కు దూరంగా ఉన్నాడు.'అని హార్దిక్ పాండ్యా తెలిపాడు.
నామమాత్రపు మ్యాచ్ కావడంతోనే బుమ్రాకు రెస్ట్ ఇచ్చి అర్జున్ టెండూల్కర్ను తీసుకున్నామని హార్దిక్ పాండ్యా చెప్పాడు. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోనూ మార్పులు జరిగాయి. క్వింటన్ డికాక్ ఈ మ్యాచ్కు దూరమయ్యాడని, దేవద్ పడిక్కల్, మ్యాట్ హెన్రీ జట్టులోకి వచ్చారని ఆ జట్టు సారథి కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు.
'క్వింటన్ డికాక్ ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. దేవదత్ పడిక్కల్, మ్యాట్ హెన్రీ తుది జట్టులోకి వచ్చారు. జట్టులో ఇవి చాలా పెద్ద మార్పులు. మా ప్రదర్శన తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ సీజన్ను మేం అద్భుతంగా ప్రారంభించాం. కొన్ని వారాల క్రితం మేం టాప్-4లో ఉన్నాం. కానీ తర్వాత పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. మా సత్తా చాటేందుకు ఈ మ్యాచ్ మాకు మంచి అవకాశం.'అని రాహుల్ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్, నమన్ ధిర్, సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రెవిస్, హార్దిక్ పాండ్యా, నెహాల్ వధేరా, రోమారియో షెఫర్డ్, అన్షుల్ కంబోజ్, పియూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషారా
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినీస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, అర్షద్ ఖాన్, మ్యాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మోహ్సిన్ ఖాన్