ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్... పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ముంబై నుంచి ముల్లాన్పుర్కు జట్టుతో కాకుండా ఒంటరిగా వెళ్లిన హార్దిక్ పాండ్యా.. విమానాశ్రయంలో బనియన్తో కనిపించాడు.
ఉక్కపోతగా ఉండటంతో తన జాకెట్ను విప్పి తన సెక్యూరిటీ సిబ్బందికి ఇచ్చాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు మండిపడుతున్నారు.ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోవాలని హార్దిక్కు సూచిస్తున్నారు. పబ్లిక్ ప్లేస్లో ఎలా ఉండాలనే ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా? అని మండిపడుతున్నారు. భారత క్రికెటర్గా హార్దిక్ పాండ్యాను అనుసరించేవారు చాలా మంది ఉంటారని, ముఖ్యంగా చిన్నపిల్లలు వారి నుంచి ఎంతో నేర్చుకుంటారని కామెంట్ చేస్తున్నారు. జాకెట్ మోయడానికి ఒకరు.. లగేజి తీసుకురావడనికి మరోకరు.. ఇన్ని ఎక్స్ట్రాలు అవసరమా? అని మండిపడుతున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ముఖ్యంగా రోహిత్ శర్మ అభిమానులే.. హార్దిక్ పాండ్యాను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ సారథిగా హార్దిక్ పాండ్యాను నియమించడాన్ని రోహిత్ శర్మ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే మ్యాచ్ల సందర్భంగా అతన్ని గేలి చేస్తున్నారు.
జట్టులో కూడా హార్దిక్ పాండ్యాకు సరైన సహకారం లభించడం లేదు. జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్లు కూడా హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడంపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాంతోనే కెప్టెన్గా హార్దిక్ పాండ్యా రాణించలేకపోతున్నాడు. వరుసగా మూడు పరాజయాలు ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్.. తర్వాతి రెండు మ్యాచ్ల్లో విజయం సాధించింది.
కానీ చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన గత మ్యాచ్లో ఓటమిపాలైంది. 6 మ్యాచ్ల్లో 2 విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో కొనసాగుతోంది.