IPL 2024 సీజన్ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టును విడిచి తన పాత ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. క్యాష్ డీల్ ట్రేడింగ్ ద్వారా హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ తమ జట్టులోకి తెచ్చుకుంది.
హార్దిక్ పాండ్యా కాంట్రాక్ట్ ధర రూ. 15 కోట్లతో పాటు భారీ మొత్తంలో ట్రాన్స్ఫర్ ఫీజును గుజరాత్ టైటాన్స్కు చెల్లించి ట్రేడ్ చేసుకుంది. అయితే స్టార్ పేసర్ మహమ్మద్ షమీ కూడా హార్దిక్ బాటలోనే నడిచేందుకు ప్రయత్నించడంతో గుజరాత్ టైటాన్స్కు ఊహించని షాక్ తగిలింది.

మహమ్మద్ షమీని ట్రేడ్ చేసుకుంటామని ఓ ఫ్రాంచైజీ తమను సంప్రదించిందని గుజరాత్ టైటాన్స్ సీఈఓ కల్నల్ అర్విందర్ సింగ్ తెలిపాడు. అయితే సదరు ఫ్రాంచైజీ అధికారులు షమీ ట్రేడింగ్ డీల్ కోసం గుజరాత్ టైటాన్స్ మేనేజ్మెంట్ను సంప్రదించకుండా సపోర్ట్ స్టాఫ్ను ఆశ్రయించారని చెప్పాడు.
ఈ అప్రోచ్ బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిబంధనలకు పూర్తిగా విరుద్దమని పేర్కొన్నాడు. షమీ ట్రేడింగ్ విషయమై ఓ చానెల్తో మాట్లాడిన గుజరాత్ టైటాన్స్ సీఈఓ.. పద్దతి ప్రకారం కాకుండా నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించారని తెలిపాడు.
'మహమ్మద్ షమీ ట్రేడింగ్ గురించి ఓ ఫ్రాంచైజీ మమ్మల్ని సంప్రదించడం వాస్తవమే. అయితే సదరు ఫ్రాంచైజీ అధికారులు మేనేజ్మెంట్ను కాకుండా సపోర్ట్ స్టాఫ్ను సంప్రదించారు. ఇది బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ రూల్స్కు విరుద్దం. నిబంధనల ప్రకారం అప్రోచ్ అయ్యి ఉంటే సదరు ఫ్రాంచైజీతో ఈ డీల్ గురించి మాట్లాడేవాళ్లం.'అని అర్విందర్ సింగ్ చెప్పుకొచ్చాడు.
అయితే షమీ కోసం అప్రోచ్ అయిన ఫ్రాంచైజీ పేరును మాత్రం అతను వెల్లడించలేదు. హార్దిక్ పాండ్యా క్యాష్ డీల్పై కూడా స్పందించిన అర్విందర్ సింగ్.. అతని నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని తెలిపాడు. మహమ్మద్ షమీ ఆసక్తి చూపించడంతోనే సదరు ఫ్రాంచైజీ అప్రోచ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ఫ్రాంచైజీ ఆర్సీబీ అయ్యుంటందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ ముగిసినా.. ట్రేడింగ్కు డిసెంబర్ 12 వరకు అవకాశం ఇచ్చారు. దాంతో పక్క జట్లలోని ఆటగాళ్లకు ఫ్రాంచైజీలు గాలం వేస్తున్నాయి. డిసెంబర్ 19న ఐపీఎల్ 2024 మినీ వేలం దుబాయ్ వేదికగా జరగనుంది.