ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు యువ వికెట్ కీపర్, జార్ఖండ్ ప్లేయర్ రాబిన్ మింజ్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతని పరిస్థితి విషమంగా లేనప్పటికీ గాయాలైనట్లు తెలుస్తోంది. శనివారం తన 'కవాసకి సూపర్ బైక్'పై ఒంటరిగా వెళ్తున్న రాబిన్ మింజ్.. అదుపు తప్పి ఎదురుగా వచ్చిన మరో బైకర్ను ఢీ కొట్టినట్లు అతని తండ్రి ఫ్రాన్సిస్ మింజ్ తెలిపాడు.
ఈ ప్రమాదంలో అతనికి స్వల్ప గాయాలయ్యాయని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని పేర్కొన్నాడు. రోడ్డుపై పడిపోవడంతో రాబిన్ మింజ్ కుడి మోకాలు కొట్టుకుపోయిందని, బైక్ ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నదని ఫ్రాన్సిస్ మింజ్ తెలిపాడు. 'రాబిన్ మింజ్ తన బైక్పై పూర్తిగా నియంత్రణ కోల్పోయాడు.

ఎదురుగా వచ్చిన మరో బైకర్ను ఢీకొట్టాడు. ప్రస్తుతం అయితే ఎలాంటి సీరియస్ లేదు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు'అని ఫ్రాన్సిస్ మింజ్ తెలిపినట్లు గుజరాత్ టైటాన్స్ పేర్కొంది. కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో కర్ణాటకపై జార్ఖండ్ తరఫున 137 పరుగులు చేసిన రాబిన్ మింజ్.. ఈ మ్యాచ్ అనంతరం ఇంటికి వచ్చాడు.
అతను ఐపీఎల్ 2024 ప్రీ సీజన్ క్యాంప్లో చేరాల్సి ఉంది. కానీ ప్రస్తుత ప్రమాదం అతని చేరికను ఆలస్యం చేసే అవకాశం ఉంది. ఐపీఎల్ 2024 సీజన్లో రాబిన్ మింజ్ను గుజరాత్ టైటాన్స్ రూ. 3.6 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్తో పోటీపడి మరీ కొనుగోలు చేసింది.
ఇటీవలే రాబిన్ మింజ్ తండ్రి ఫ్రాన్సిస్ మింజ్ను రాంచీ విమానాశ్రయంలో కలిసానని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. భారత్ వర్సెస్ ఇంగ్లండ్ నాలుగో టెస్ట్ కోసం రాంచీ వచ్చిన శుభ్మన్ గిల్.. ఈ సందర్భంగా ఫ్రాన్సిస్ మింజ్ను కలిసాడు. ఆర్మీ నుంచి రిటైర్ అయిన ఫ్రాన్సిస్ మింజ్.. రాంచీ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ అధికారికగా సేవలందిస్తున్నాడు.
రాబిన్ మింజ్ పెద్దగా దేశవాళీ క్రికెట్ ఆడకపోయినా.. 14 టీ20 మ్యాచ్ల్లో 148.9 స్ట్రైక్రేట్తో 353 పరుగులు చేశాడు. దూకుడుగా ఆడగలిగే సామర్థ్యం ఉండటంతో అతని కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి.