ఐపీఎల్ 2024 సీజన్లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్కు గుడ్ న్యూస్. ఆ జట్టు స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్లో ఆడేందుకు బీసీసీఐ మెడికల్ టీమ్ అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
స్పోర్ట్స్ హెర్నీయా సర్జీరీ చేయించుకున్న సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. ఐపీఎల్ ముంగిటే గాయం నుంచి పూర్తిగా కోలుకున్న సూర్యకుమార్ యాదవ్.. మ్యాచ్ ఫిట్నెస్ సాధించడంలో విఫలమయ్యాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభానికి ముందు ఎన్సీఏ అధికారులు నిర్వహించిన ఫిట్నెస్ టెస్ట్ల్లో సూర్య విఫలమయ్యాడు.

దాంతో ఐపీఎల్ ఆడేందుకు సూర్యకుమార్ యాదవ్కు అనుమతి లభించలేదు. జూన్లో టీ20 ప్రపంచకప్ 2024 ఉండటంతో సూర్య విషయంలో బీసీసీఐ చాలా కేర్ తీసుకుంటుంది. ఎలాంటి తొందరపాటు అవసరం లేకుండా పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాతే ఐపీఎల్ ఆడేందుకు అనుమతివ్వాలని బీసీసీఐ మెడికల్ టీమ్ను ఆదేశించింది.
ఈ క్రమంలోనే ఎన్సీఏ అధికారులు సూర్యకుమార్ యాదవ్కు కఠినమైన ఫిట్నెస్ టెస్ట్లు నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా నిర్వహించిన ఫిట్నెస్ టెస్ట్ను సూర్యకుమార్ యాదవ్ క్లియర్ చేసినట్లు ఓ జాతీయ దినపత్రిక తెలిపింది. దాంతోనే ఐపీఎల్ ఆడేందుకు అతనికి బీసీసీఐ అనుమతి ఇచ్చినట్లు పేర్కొంది.

మరో 24 గంటల్లో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టుతో కలుస్తాడని, ఆ జట్టు తదుపరి మ్యాచ్లో ఆడుతాడని తెలపింది. ముంబై ఇండియన్స్ ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది. సూర్య జట్టులోకి వస్తే ముంబై ఇండియన్స్ బలం రెట్టింపు అవనుంది. నమన్ ధిర్ స్థానంలో అతను తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ సీజన్ను ఓటమితో ప్రారంభించిన ముంబై ఇండియన్స్.. వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడి హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసింది. పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది. గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లతో పాటు సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లోనూ ముంబై ఇండియన్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.