ఐపీఎల్ 2024 సీజన్కు ముందు కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లకు ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఐపీఎల్ అంటే బాలీవుడ్ హీరోయిన్స్, మ్యాచ్ తర్వాత జరిగే పార్టీలు కాదని.. ఆటపై ఫోకస్ పెట్టాలని సూచించాడు. గత సీజన్ వరకు లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మెంటార్గా వ్యవహరించిన గంభీర్.. ఈ ఏడాది కేకేఆర్కు మారాడు.
గతంలో ఆ జట్టు సారథిగా 2012, 2014 సీజన్లలో కేకేఆర్ను విజేతగా నిలిపాడు. కేకేఆర్ మెంటార్గా జట్టుకు సేవలందించేందుకు రాజకీయాల నుంచి కూడా తప్పుకున్నాడు. అప్కమింగ్ సీజన్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో పాల్గొన్న గౌతమ్ గంభీర్.. తమ ఆటగాళ్లను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'ఐపీఎల్ అంటే ఏదో సరదాగా తీసుకునే అంశం కాదని మా ఆటగాళ్లకు తొలి రోజే స్పష్టం చేశా. ఐపీఎల్ అంటే బాలీవుడ్ హీరోయిన్లు, మ్యాచ్ల తర్వాత చేసుకునే పార్టీలు కాదు. పోటాపోటీగా సాగే క్రికెట్ టోర్నీ. ప్రపంచంలోనే క్రికెట్ లీగ్లన్నింటిలో నూ ఈ టోర్నీ మాత్రమే సరైన దిశలో వెళ్తోందని నా విశ్వాసం.
ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్కు ఏ మాత్రం తీసిపోకుండా విజయవంతంగా సాగుతున్న లీగ్ ఇది. అందుకు తగ్గట్లుగానే మైదానంలో మన ఆటతీరు ఉండాలి. ముఖ్యంగా అభిమానులు మనపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వారి పట్ల నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉంది. మన ఆట తీరుతో వాళ్ల ముఖాలపై చిరునవ్వులు పూయించాలి.
అందరితో పోలిస్తే కోల్కతా అభిమానులే మరింత విశ్వాస పాత్రులుగా ఉంటారని నా అభిప్రాయం. తొలి మూడు సీజన్లలో దారుణంగా విఫలమైనా వారు జట్టుకు అండగా నిలిచారు. అలాంటి వాళ్ల కోసం మనం కచ్చితంగా టైటిల్ గెలవాలి'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
బీజేపీ తరఫున తూర్పు ఢిల్లీ నుంచి లోక్సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న గౌతమ్ గంభీర్.. ఈ సారి పోటీ నుంచి తప్పుకున్నాడు. క్రికెట్ కమిట్మెంట్స్పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని గౌతమ్ గంభీర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.