ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఓటమిపై కోల్కతా నైట్రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంతోనే ఆర్సీబీ ఓటమిపాలైందని చెప్పాడు. ఇక మూమెంటమ్తో మ్యాచ్ ఫలితాలు రావని స్పష్టం చేశాడు.
ఆర్సీబీ వరుసగా 6 మ్యాచ్లు గెలిచి మంచి మూమెంటమ్ అందుకున్నా.. కీలక మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చకపోతే ఓటమే ఎదురవుతుందని చెప్పాడు. బ్యాట్, బాల్కు మూమెంటమ్ తెలియదన్నాడు.

ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ ఈ విషయాలు చెప్పాడు. ఐపీఎల్లో ప్రతీ జట్టు బలమైనదేనని, 10వ స్థానంలో నిలిచిన జట్టు కూడా అగ్రస్థానంలో నిలిచిన జట్టును ఓడిస్తుందని తెలిపాడు. 'నేను కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా ఈ మూమెంటమ్ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు.
అయితే ఈ మూమెంటమ్ కంటే మైదానంలో మీరు చూపించే తీవ్రతనే ఫలితాన్ని రాబడుతోంది. నిర్భయంగా, ధైర్యంగా ఆడే జట్టుకు ప్రయోజనం చేకూరుతోంది. ఎందుకంటే బ్యాట్, బాల్కు మూమెంటమ్ అంటే ఏంటో తెలియదు. నాకౌట్ మ్యాచ్లకు ముందు ఆటగాళ్ల మనస్థత్వం, నిలకడ చాలా కీలకం. ప్రతీ మ్యాచ్ను ఆటగాళ్లు ఒకేలా చూడాలి. సమ ప్రాధాన్యత ఇవ్వాలి.
ఐపీఎల్లో నెంబర్ వన్ టీమ్కు పదో స్థానంలో నిలిచిన జట్టుకు పెద్ద తేడా ఏం ఉండదు. ఈ రెండు జట్ల మధ్య ఓ ఐదు మ్యాచ్ల సిరీస్ పెడితే.. పదో స్థానంలో నిలిచిన జట్టు గెలిచినా నేను ఆశ్చర్యపోను. అందుకే ఐపీఎల్ చాలా కఠినమైన టోర్నీ అని చెబుతున్నా. టీ20 ప్రపంచకప్ కంటే కూడా ఐపీఎల్ చాలా కఠినం. జట్లన్నీటికి సమానమైన పర్స్ ఉంటుంది. కాబట్టి అన్ని జట్లు బలంగానే ఉంటాయి.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే క్వాలిఫయర్-2లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్టే విజయం సాధిస్తుందని చెప్పాడు. ఇరు జట్లు బలంగానే ఉన్నాయని చెప్పాడు. అత్యుత్తమ ప్రదర్శన చేయడంతోనే ప్లే ఆఫ్స్ చేరాయని స్పష్టం చేశాడు. మైదానంలో ఎవరు అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే వారినే విజయం వరిస్తుందని తెలిపాడు.