ఐపీఎల్ 2024 టైటిల్ను కోల్కతా నైట్రైడర్స్ గెలుచుకోవడంతో ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ది కీలక పాత్ర. ఆ జట్టు ఆటగాళ్లతో పాటు క్రికెట్ ఎక్స్పర్ట్స్, ఫ్యాన్స్ ఇదే విషయాన్ని చెబుతున్నారు. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ మైదానంలో తన ప్రణాళికలను అమలుపర్చినప్పటికీ తెర వెనక వ్యూహ రచన మాత్రం గౌతమ్ గంభీర్దే. చాలా మ్యాచ్ల్లో ఈ విషయం స్పష్టమైంది.
సీజన్ ప్రారంభం నుంచే టైటిలే లక్ష్యంగా పని ప్రారంభించిన గంభీర్.. కేకేఆర్ను పూర్తిగా మార్చేసాడు. గత మూడు సీజన్లలో కనీసం ప్లే ఆఫ్స్ చేరలేకపోయిన కేకేఆర్.. గంభీర్ రాకతో ఛాంపియన్గా నిలిచింది. ఈ సీజన్లో కేకేఆర్ కేవలం మూడు మ్యాచ్ల్లోనే ఓటమిపాలైందంటే ఆ జట్టు ఎంతలా ఆధిపత్యం చెలాయించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఎప్పుడూ సీరియస్గా ఉండే గంభీర్.. టైటిల్ గెలిచిన అనంతరం చిరునవ్వులు చిందించాడు. సునీల్ నరైన్తో కలిసి ఆనందాన్ని పంచుకున్నాడు. ఇద్దరిని ఒకరినొకరు ఎత్తుకున్నారు. కేకేఆర్ ఓనర్ షారూఖ్ ఖాన్ సైతం గంభీర్ను ప్రశంసిస్తూ ఓ ముద్దు పెట్టాడు. సునీల్ నరైన్ను ఓపెనర్గా ఆడించడం.. ఆండ్రీ రస్సెల్ గతంలో మాదిరి చెలరేగడం, మిచెల్ స్టార్క్ను రూ. 24.75 కోట్లు పెట్టి కొనుగోలు చేయడంతో పాటు అతనిపై పూర్తి నమ్మకం ఉంచడం గంభీర్ మార్క్ నిర్ణయాలుగా చెప్పవచ్చు.
ఈ విజయానంతరం ఏం మాట్లాడని గంభీర్.. ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు అది సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారింది. 'ఎవరి ఆలోచనలు, చర్యలు సత్యంపై ఆధారపడి ఉంటాయో వారికి ఇప్పటికీ శ్రీకృష్ణుడే రథసారథి'అంటూ హిందీలో చేసిన తాత్వికతతో కూడిన పోస్ట్ను పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
అయితే ఈ పోస్ట్ వెనుక ఉద్దేశం ఏంటనేది మాత్రం అర్థం కావడం లేదు. 2011, 2007 టీ20 ప్రపంచకప్లను భారత్ అందుకోవడంలో గంభీర్ది కీలక పాత్ర. ఈ రెండు మెగా ఫైనల్లో గంభీర్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. కానీ అతనికి రావాల్సిన గుర్తింపు రాలేదు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకే ఈ క్రెడిట్ దక్కింది. ఈ విషయంలో గంభీర్.. చాలా సార్లు అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
అయితే తాజా విజయంతో అంతటి కంటే ఎక్కువ పేరు వచ్చిందని నెటిజన్లు గంభీర్ను ప్రశంసిస్తున్నారు. ఇది దేవుడు రాసిన రాతని, ఎవరూ తప్పించుకోలేరని కామెంట్ చేస్తున్నారు. గతంలో కేకేఆర్ కెప్టెన్గా 2012, 2014 సీజన్ల టైటిళ్లను అందుకున్న గంభీర్.. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత మెంటార్గా మరో సారి తన జట్టును ఛాంపియన్గా నిలబెట్టాడు.
కేకేఆర్ విజయంలో గంభీర్ది కీలక పాత్రని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా కొనియాడారు. 'గంభీర్ను మెంటార్గా ప్రకటించినప్పుడు సంతోషం వ్యక్తం చేస్తూ ఓ మెసేజ్ పంపాను. దానికి ఆయన థ్యాంక్స్ చెబుతూనే.. చేతిలో ట్రోఫీతో పోడింయపై నిలబడితేనే సంతోషిస్తానని బదులిచ్చారు. ఆ రోజు రానే వచ్చింది.'అని నితీష్ రాణా గుర్తు చేసుకున్నాడు. రింకూ సింగ్, సునీల్ నరైన్ సైతం గంభీర్ వల్లే టైటిల్ గెలిచామని తెలిపారు.