ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2024 షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వెల్లడించింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు 21 మ్యాచ్ల వివరాలనే వెల్లడించిన బీసీసీఐ.. సోమవారం మిగతా 53 మ్యాచ్ల షెడ్యూల్ను ప్రకటించింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నా.. మొత్తం 74 ఐపీఎల్ మ్యాచ్లు భారత్లోనే జరుగుతాయని స్పష్టం చేసింది. మే 26న చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా జరిగే ఫైనల్తో ఈ సీజన్ ముగుస్తుందని తెలిపింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మే 21, 22న క్వాలిఫయర్ 1, క్వాలిఫయర్ 2 జరగనుండగా.. మే 24న చెన్నై వేదికగా క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగనుంది.

మే 19వ తేదీ వరకు లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ షెడ్యూల్ వివరాలను అధికారిక బ్రాడ్కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలు స్పెషల్ షోల ద్వారా వెల్లడించాయి. ఎన్నికల తేదీల్లోనూ బీసీసీఐ.. మ్యాచ్లను షెడ్యూల్ చేయడం విశేషం.
ఇక దేశంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో జరగనున్నాయి. తెలుగు రాష్ట్రల్లో మే 13న ఎన్నికలు జరగనుండగా.. ఆ రోజు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కేకేఆర్ మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది. పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో మ్యాచ్లు లేకుండా బీసీసీఐ షెడ్యూల్ను ప్లాన్ చేసింది.