సాఫిగా సాగుతున్న ఐపీఎల్ 2024 సీజన్లో ఫిక్సింగ్ కలకలం రేపింది. జైపూర్, వాంఖడే మైదానాల్లోని లగ్జరీ బాక్స్ల్లో కూర్చున్న నలుగురు అనుమానిత బుకీలను పోలీసులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
గతంలో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతాల నేపథ్యంలో మళ్లీ అలాంటి పరిస్థితులు రాకుండా బీసీసీఐ, ఐపీఎల్ నిర్వహకులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఫిక్సింగ్ను అడ్డుకునేందుకు బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్(ఏయూసీ)ని కూడా ఏర్పాటు చేసింది.

మార్చి 28న జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇద్దరి బుకీలను అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మ్యాచ్ కార్పొరేట్ బాక్స్లో సదరు వ్యక్తులను యాంటీ కరప్షన్ యూనిట్ గుర్తించిందని, వారిని పోలీసులకు అప్పగించడంతో పాటు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది.
వారి ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి సరైన ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు వదిలేసినట్లు సమాచారం. ముంబైలోని వాంఖడే స్టేడియంలోని ప్రెసిడెంట్ బాక్స్కు మరో ఇద్దరు అనుమానితులు వచ్చారని, మ్యాచ్ నిర్వాహకులు వారిని బయటకు పంపించి పోలీసులకు అప్పగించారని నేషనల్ మీడియా పేర్కొంది. అయితే వీరి వద్ద కూడా అనుమానించ దగిన ఆధారాలు లభించకపోవడంతో వదిలేసినట్లు సమాచారం.
2013లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీశాంత్, అజిత్ చండీలాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విచారణ అనంతరం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లపై రెండేళ్ల పాటు నిషేధం కూడా పడింది. ఇప్పుడు అనుమానితులను అదుపులోకి తీసుకున్న రెండు సందర్భాల్లోనూ రాజస్థాన్ రాయల్స్ జట్టే ఉండటంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఆటగాళ్ల స్పాట్ ఫిక్సింగ్కు అవకాశం లేదు. కానీ బుకీలు లైవ్ మ్యాచ్ను చూసి బెట్టింగ్లకు పాల్పడే అవకాశం ఉంది. మైదానంలో మ్యాచ్కు.. టీవీలో ప్రసారమయ్యే లైవ్ స్ట్రీమింగ్కు మధ్య వ్యత్సాసం ఉంటుంది. ఈ సమయాన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు బుకీలు కార్పోరేట్ బాక్స్లకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వ్యక్తులపై బీసీసీఐ కూడా గట్టి నిఘా పెట్టింది.