సన్రైజర్స్ హైదరాబాద్ చెత్త రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో చెన్నై వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ 113 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఐపీఎల్ ఫైనల్స్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకుంది.

ఈ మ్యాచ్లో కేకేఆర్ స్టార్ పేసర్స్ మిచెల్ స్టార్క్(2/14), హర్షిత్ రాణా(2/14) నిప్పులు చెరగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు కుప్పకూలింది. ఎయిడెన్ మార్క్రమ్(23 బంతుల్లో 3 ఫోర్లతో 20), ప్యాట్ కమిన్స్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా రెండేసి వికెట్లు తీయగా.. ఆండ్రీ రస్సెల్(3/19) మూడు వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తీ, సునీల్ నరైన్ తలో వికెట్ తీసారు. ఐపీఎల్ చరిత్రలోనే ఫైనల్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా సన్రైజర్స్ చెత్త రికార్డ్ నమోదు చేసింది.
సన్రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(2), ట్రావిస్ హెడ్(0), రాహుల్ త్రిపాఠి(9), హెన్రీచ్ క్లాసెన్(16) ఎయిడెన్ మార్క్రమ్(20), నితీష్ కుమార్ రెడ్డి(13), షెహ్బాజ్ అహ్మద్(8), అబ్దుల్ సమద్(4), జయదేవ్ ఉనాద్కత్(4) దారుణంగా విఫలమయ్యారు.
ఇప్పటి వరకు ఈ చెత్త రికార్డ్ చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉండగా.. తాజాగా హైదరాబాద్ అధిగమించింది. కోల్కతా వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన ఐపీఎల్ 2013 ఫైనల్లో సీఎస్కే 125/9 స్కోర్ నమోదు చేసి ఓటమిపాలైంది. ఐపీఎల్ 2017 ఫైనల్లో ముంబై ఇండియన్స్ 129/8 చేయగా.. రైజింగ్ పూణే 128/6 పరుగులే చేసి ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. ఇప్పటి వరకు ఇవే అత్యల్ప స్కోర్లుగా ఉండగా.. ఇప్పుడు ఈ జాబితాలో సన్రైజర్స్ చేరింది.
ఈ సీజన్లో 287/3, 277/3 స్కోర్లతో టీ20 చరిత్రలోనే భారీ స్కోర్లు నమోదు చేసిన జట్టుగా చరిత్రకెక్కిన సన్రైజర్స్.. ఫైనల్లో మాత్రం దారుణంగా విఫలమైంది.