ఐపీఎల్ 2024 టైటిల్ను కోల్కతా నైట్రైడర్స్ కైవసం చేసుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్తో చెన్నై వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో కోల్కతా నైట్రైడర్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. మెంటార్గా గౌతమ్ గంభీర్ రీఎంట్రీ.. కోల్కతా నైట్రైడర్స్ ఛాంపియన్గా నిలిచేలా చేసింది.

మరోసారి పేలవ బ్యాటింగ్తో సన్రైజర్స్ హైదరాబాద్ చిత్తయ్యింది. ఈ సీజన్లో కేకేఆర్తో జరిగిన మూడు మ్యాచ్ల్లోనూ ఆరెంజ్ ఆర్మీకి నిరాశ తప్పలేదు. హోరాహోరీ పోరు తప్పదనుకున్న ఈ ఫైనల్ మ్యాచ్.. సన్రైజర్స్ బ్యాటర్ల పేలవ ప్రదర్శన కారణంగా ఏకపక్షంగా ముగిసింది. ఈ ఓటమి ఆరెంజ్ ఆర్మీ అభిమానులకు కన్నీళ్లనే మిగిల్చింది.
టైటిల్ చేజారినందుకు బాధలేకున్నా.. కీలక ఫైనల్లో ఓడిన తీరే అభిమానులను తీవ్రంగా బాధిస్తోంది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో సన్రైజర్స్ అన్ని విభాగాల్లో తేలిపోయింది.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు కుప్పకూలింది. ఎయిడెన్ మార్క్రమ్(23 బంతుల్లో 3 ఫోర్లతో 20), ప్యాట్ కమిన్స్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా రెండేసి వికెట్లు తీయగా.. ఆండ్రీ రస్సెల్(3/19) మూడు వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తీ, సునీల్ నరైన్ తలో వికెట్ తీసారు. ఐపీఎల్ చరిత్రలోనే ఫైనల్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా సన్రైజర్స్ చెత్త రికార్డ్ నమోదు చేసింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 10.3 ఓవర్లలో 2 వికెట్లకు 114 పరుగులు చేసి 57 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. సునీల్ నరైన్(6) విఫలమైనా.. రెహ్మానుల్లా గుర్బాజ్(32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 39), వెంకటేశ్ అయ్యర్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 52 నాటౌట్) సత్తా చాటారు.
సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్, షెహ్బాజ్ అహ్మద్ తలో వికెట్ తీసారు. ఈ టోర్నీ ఆసాంతం కేకేఆర్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. టోర్నీ మొత్తంలో మూడు మ్యాచ్ల్లోనే ఓటమిపాలైంది.