ఐపీఎల్ 2024 సీజన్లో బౌలర్ల పరిస్థితి దయనీయంగా మారింది. టీ20ల్లో 180-200 లక్ష్యం గొప్ప? అనే కాలం నుంచి 300 కూడా కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. చిన్న మైదానాలు, తేమ ప్రభావం, బ్యాటర్లకు అనుకూలంగా ఉన్న నిబంధనలు బౌలర్ల పాలిట శాపంగా మారాయి. ఇప్పటికే ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ 287/3, 277/3 భారీ స్కోర్లు నమోదు చేస్తే.. శుక్రవారం పంజాబ్ కింగ్స్ 261 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా చేధించింది.
మాజీ క్రికెటర్లకు, వెటరన్ క్రికెట్ ఫ్యాన్స్ ఈ స్కోర్లు చూసి నవ్వుకుంటున్నారు. అయ్యో పాపం బౌలర్లని జాలిపాడుతున్నారు. ఎందుకంటే ఆఫ్ అండ్ మిడిల్ స్టిక్ మీది బాల్ ను ఆఫ్ సైడ్ మాత్రమే ఆడాలనుకునే మూఢత్వం విరివిగా ఉన్న రోజుల నుంచి వైడ్ అవుటాఫ్ ది ఆఫ్ స్టంప్ బాల్ ను ఫైన్ లెగ్ మీంచి కొట్టే కాలం వచ్చింది.

బ్యాట్స్మన్ గేమ్..
60 ఓవర్ల మ్యాచ్లో అత్యధిక స్కోర్ 334 మాత్రమే. ఆ తరవాత 60 ఓవర్లు కాస్తా 50 కి తగ్గాక కూడా 250 డిఫెండబుల్గా ఉండేది. మెల మెల్లగా అది 300 కు చేరింది. ఆస్ట్రేలియా మీద 434 ఛేజ్ చేస్తూ దక్షిణాఫ్రికా విజయం సాధించినప్పుడు కలీస్ ' వాళ్ళు ఇంకో పదిహేను పరుగులు తక్కువ కొట్టారు ' అన్నాడంటేనే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఒక 50 ఓవర్ల మ్యాచ్లో ఇంగ్లండ్ 470 కొడితే హమ్మయ్య 500 కొట్టకుండా ఆపగలిగాం అనుకుందట ఆస్ట్రేలియా. ఆ తరవాత 50 ఓవర్ల మ్యాచ్ లు కూడా బోర్ కొట్టడం మొదలయ్యాక పొట్టి ఫార్మాట్ టీ20లో 160 కొడితే చాలనుకునేవాళ్ళు. అది అలవోకగా 180 మీదుగా 200 కు చేరింది. ఇప్పుడు 225 ను కూడా సులువుగా ఛేజ్ చేసేస్తున్నారు. 277 ఛేజ్ చేస్తూ 241...287 ఛేజ్ చేస్తూ 262 కొట్టడం, 261 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయసంగా చేధించడం చూస్తుంటే జెంటిల్మన్ గేమ్ కాస్త బ్యాట్స్మన్ గేమ్గా మారిందని అనకుండా ఉండలేం.
రూల్స్ మార్చాలంటూ..
పంజాబ్ కింగ్స్ 261 పరుగుల లక్ష్యాన్ని చేధించడంపై రవిచంద్రన్ అశ్విన్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. 'బౌలర్లను ఎవరైనా కాపాడండి'అంటూ అతను ట్వీట్ చేయగా.. దేవుడికి దండం పెడుతూ చాహల్ రిప్లే ఇచ్చాడు. మహమ్మద్ సిరాజ్ సైతం.. భారీ స్కోర్లపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. బ్యాటర్ల హవా నడుస్తున్న టోర్నీలో.. బౌలర్ల ప్రదర్శనతో వారి సత్తాను అంచనా వేయడం సరికాదని అసహనం వ్యక్తం చేశాడు.
సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు బౌండరీల దూరం పెంచాలని సూచిస్తున్నాడు. ఏది ఏమైనా.. క్రికెట్లో బ్యాటర్లదే హవా సాగడం అభిమానులకు రుచించడం లేదు. బ్యాట్, బంతి మధ్య సరైన పోరు ఉంటేనే క్రికెట్ బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.