IPL 2024 సీజన్ నేపథ్యంలో కెప్టెన్ను మారుస్తు ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది. సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారంపై దుమారం రేగుతోంది. రోహిత్ శర్మను తప్పిస్తూ హార్దిక్ పాండ్యాను నూతన సారథిగా ముంబై ఇండియన్స్ ప్రకటించడాన్ని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ముఖ్యంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్.. భావోద్వేగంగా స్పందిస్తున్నారు. కొందరు సోషల్ మీడియా వేదికగా ముంబై ఇండియన్స్ పేజీలను అన్ఫాలో చేస్తుంటే.. మరికొందరు ఆ జట్టు జెర్సీ, క్యాప్లను తగలబెట్టి నిరసన తెలుపుతున్నారు. ఇంకొందరు ముంబై ఇండియన్స్ నుంచి రోహిత్ శర్మ తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ మధ్యలో తెలుగు రాష్ట్రాలకు చెందిన రోహిత్ అభిమానులు కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. వెంటనే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ను వీడి సన్రైజర్స్ హైదరాబాద్లోకి వచ్చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆరంభంలో రోహిత్ శర్మ హైదరాబాద్కు చెందిన డెక్కన్ చార్జెర్స్ జట్టుతోనే ఆడాడని, 2009లో టైటిల్ గెలవడంలో కూడా రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడని గుర్తు చేస్తున్నారు.
ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్కు భారత కెప్టెన్ అవసరం ఉందని, రోహిత్ జట్టులోకి వస్తే తిరుగుండదని పోస్ట్లు పెడుతున్నారు. డిసెంబర్ 19న ఐపీఎల్ 2024 వేలం తర్వాత కూడా ట్రేడింగ్కు అవకాశం ఉందని గుర్తు చేస్తున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సైతం రోహిత్ శర్మతో సంప్రదింపు జరపాలని కోరుతున్నారు.
డిసెంబర్ 12నే ట్రేడింగ్ విండో ముగిసినా.. డిసెంబర్ 19న జరిగే మినీ వేలం తర్వాతి రోజు నుంచి మళ్లీ ఓపెన్ కానుంది. ఐపీఎల్ ప్రారంభమయ్యే ముందు నెలవరకు ఆటగాళ్లను ట్రేడింగ్ చేసుకునే వెసులు బాటును బీసీసీఐ కల్పించింది. దాంతో వేలం తర్వాత కూడా ఆయా జట్లలో మార్పులు జరిగే అవకాశం ఉంది.
సన్రైజర్స్ హైదరాబాద్ను రోహిత్ శర్మ అంగీకరిస్తాడా? అంటే అవునని చెప్పే పరిస్థితి అయితే లేదు. రోహిత్ శర్మతో సంప్రదింపులు జరిపిన తర్వాతే హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చినట్లు ముంబై ఇండియన్స్ స్పష్టం చేసింది. హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ దగ్గర్నుంచి కెప్టెన్గా ప్రకటించేవరకు ప్రతీ విషయం రోహిత్ శర్మ తెలుసని, అతనితో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయాలు తీసుకున్నామని కూడా వెల్లడించింది.
రోహిత్ శర్మ సైతం ఐపీఎల్లో తన చివరి మ్యాచ్ ముంబై తరఫునే ఆడుతానని కూడా గతంలో వెల్లడించాడు. అవసరమైతే ఆట నుంచి తప్పుకుంటాడే తప్పా మరో జట్టు తరఫున అయితే ఆడే అవకాశం లేదు. ఒకవేళ రోహిత్తో చర్చించకుండా హార్దిక్ పాండ్యాను ముంబై కెప్టెన్గా ప్రకటిస్తే మాత్రం.. అతను జట్టు మారుతాడు.