ఐపీఎల్ 2024 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపుతోంది. విధ్వంసకర బ్యాటింగ్తో రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటికే రెండు సార్లు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక భారీ స్కోర్ నమోదు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్.. తాజాగా మరోసారి రికార్డు స్కోర్ అందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో 266/7 పరుగుల భారీ స్కోర్ చేసింది.
దాంతో ఒక సీజన్లో మూడు సార్లు 250 ప్లస్ రన్స్ చేసిన జట్టుగా చరిత్రకెక్కింది. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 277/3 స్కోర్ నమోదు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 287/3 స్కోర్ చేసి తమ రికార్డును మెరుగుపరుచుకుంది. తాజా మ్యాచ్లో 266/7 పరుగుల స్కోర్ చేసింది.

ఈ రికార్డుల నేపథ్యంలో ఆర్సీబీ జట్టును నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆర్సీబీకి సంబంధించిన హయ్యెస్ట్ స్కోర్ రికార్డును సన్రైజర్స్ హైదరాబాద్ మూడు సార్లు బ్రేక్ చేసిందని కామెంట్ చేస్తున్నారు. ఫన్నీ మీమ్స్తో నవ్వులు పూయిస్తున్నారు. 'పాపం ఆర్సీబీ.. ఈ కష్టం పగోడికి కూడా రావద్దు'అని మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. గత సీజన్ వరకు ఐపీఎల్ హయ్యెస్ట్ స్కోర్ రికార్డ్ ఆర్సీబీ పేరిటనే ఉండేది. ఆ జట్టు 262/7 స్కోర్ నమోదు చేసింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 266 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(32 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్లతో 89), అభిషేక్ శర్మ(12 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లతో 46), షెహ్బాజ్ అహ్మద్(29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 59 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు.
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/55) నాలుగు వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు. ఈ భారీ స్కోర్తో సన్రైజర్స్ పలు రికార్డులను తమ పేరిట లిఖించుకుంది. బెస్ట్ పవర్ ప్లే స్కోర్, ఫాస్టెస్ట్ టీమ్ 100, ఫాస్టెస్ట్ టీమ్ 150 రన్స్, సెకండ్ ఫాస్టెస్ట్ 200 రన్స్, ఫాస్టెస్ట్ 250 రన్స్, ఒక సీజన్లో మూడు సార్లు 250 ప్లస్ రన్స్ చేసిన జట్టుగా సన్రైజర్స్ రికార్డ్కెక్కింది.