ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రోహిత్ శర్మకు సంబంధించి రోజుకో వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. తాజాగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓనర్ ఆకాశ్ అంబానీ, రోహిత్ శర్మ ఒకే కారులో ప్రయాణించడం హాట్ టాపిక్గా మారింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ కాగా.. ఆకాశ్ అంబానీ, రోహిత్ శర్మ ఒకే కారులో ప్రయాణించడంపై అనేక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్.. తమ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తొలగించి హార్దిక్ పాండ్యాకు అప్పగించిన విషయం తెలిసిందే.

రోహిత్ అసంతృప్తి..
అయితే ఈ నిర్ణయంపై రోహిత్ శర్మ అసంతృప్తిగా ఉన్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. హిట్ మ్యాన్ ఫ్యాన్స్ అయితే ఈ నిర్ణయాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతీ మ్యాచ్ సందర్భంగా తమ నిరసనను తెలియజేయడంతో పాటు హార్దిక్ పాండ్యాను గేలి చేస్తున్నారు. కొందరైతే ముంబై ఇండియన్స్ జట్టును వదిలేయాలని రోహిత్ శర్మను సూచిస్తున్నారు.
వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలం జరగనున్న నేపథ్యంలో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టును వదిలేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. రోహిత్ వేలంలోకి వస్తే తీసుకునేందుకు మిగతా ఫ్రాంచైజీలన్నీ సిద్దంగా ఉన్నాయి.
రోహిత్ కోసం లక్నో, ఢిల్లీ రెడీ..
ఇప్పటికే లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ జస్టిన్ లాంగర్.. రోహిత్ శర్మను ట్రాన్స్ఫర్ విండో ద్వారా తీసుకునేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మను తీసుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రకటించాడు.
వచ్చే ఏడాది మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ఆటగాళ్లను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా లేదా? అనే విషయంపై క్లారిటీ లేదు. మెగా ఆక్షన్ నిబంధనల ప్రకారం ఒక జట్టు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. మిగిలిన ఆటగాళ్లందరినీ వేలంలోనే తీసుకోవాల్సి ఉంటుంది.
ముంబై ఇండియన్స్ బుజ్జగింపులు..
ఈ రూల్స్ను మార్చాలని, 8 మందిని తీసుకునే అవకాశం ఇవ్వాలని ఫ్రాంచైజీలు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ను కోరుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
అయితే రోహిత్ శర్మను మరో జట్టులోకి పంపేందుకు ముంబై ఇండియన్స్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.
కెప్టెన్సీ మార్పుతోనే తమ జట్టు బ్రాండ్ వాల్యూకు తీవ్ర నష్టం జరిగిందని గుర్తించిన ఆ ఫ్రాంచైజీ ఓనర్స్.. రోహిత్ శర్మను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆకాశ్ అంబానీ.. రోహిత్ శర్మతో కారులో ప్రయాణించినట్లు ప్రచారం జరుగుతోంది.
భారీ ఆఫర్..
అవసరమైతే ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలను మళ్లీ తిరగి కట్టబెట్టేందుకు కూడా ఆ ఫ్రాంచైజీ సిద్దమైనట్లు సమాచారం. ఐపీఎల్ 2024 సెకండాఫ్లోనే ఈ నిర్ణయం తీసుకోవచ్చనే వాదను కూడా వినిపిస్తోంది.
బిజినెస్ వర్గాలు మాత్రం జట్టును వీడకుండా ఉండేందుకు రోహిత్ శర్మకు ఆ ఫ్రాంచైజీ భారీ ఆఫర్ ఇచ్చిందని, తమ వ్యాపారాల్లో భారీ విలువైన షేర్లు ఇచ్చేందుకు కూడా సిద్దమైందని పేర్కొంటున్నాయి. ఏది ఏమైనా మరికొద్ది రోజుల్లోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.