టీమిండియా దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై మరోసారి కోల్కతా నైట్రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ తన అక్కసును వెళ్లగక్కాడు. అవకాశం వచ్చినప్పుడల్లా ధోనీని విమర్శించే గంభీర్.. తన అలవాటును కొనసాగించాడు. 'ఫలితాల కంటే ప్రక్రియ ముఖ్యం'అని చెప్పే ధోనీ మాటలను గంభీర్ తప్పుబట్టాడు.
తనకు ప్రక్రియ కంటే ఫలితాలే ముఖ్యమని తెలిపాడు. కోల్కతా నైట్రైడర్స్ అభిమానులు జట్టు విజయం కోసమే ఎదురు చూస్తారని చెప్పాడు. ఐపీఎల్ 2024 సీజన్లో కేకేఆర్కు మెంటార్గా వ్యవహరిస్తున్నగౌతమ్ గంభీర్ జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. సునీల్ నరైన్ను మరోసారి ఓపెనర్గా ఆడిస్తూ సంచలన ఫలితాలు సాధిస్తున్నాడు.

ఫలితాలే ముఖ్యం..
ఈ సీజన్లో కేకేఆర్ 6 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించి రెండు మ్యాచ్ల్లోనే ఓటమిపాలైంది. ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో తమ టీమ్ ప్రదర్శనపై స్పందించిన గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నేను బహిరంగంగానే చెబుతున్నా. నాకు ఫలితమే ముఖ్యం. అందరూ చెప్పినట్లు నాకు ప్రక్రియ ఏ మాత్రం ముఖ్యం కాదు.
'సరైన విధానం ఉంటే ఫలితాలు కూడా వాటంతట అవే వస్తాయి'అని చెబుతుంటారు. కానీ ఈ మాటలను నేను ఏ మాత్రం పట్టించుకోను. నాకు ఫలితాలే ముఖ్యం. ఎందుకంటే కేకేఆర్ విజయం కోసమే అభిమానులు వస్తారు. నిజాయితీగా చెబుతున్నా.. కేకేఆర్ అభిమానులు చాలా లాయల్గా ఉంటారు.
ఆరంభం సరిగ్గా లేకున్నా..
అత్యంత నమ్మకమైన అభిమానులు కేకేఆర్కు మాత్రమే సొంతం. ఎందుకంటే తొలి మూడు సీజన్లలో కేకేఆర్ దారుణంగా విఫలమైంది. అయినా ఈ జట్టును అభిమానులు అభిమానించారు. తమ ప్రేమను, ఆట పట్ల ఉన్న అంకితభావాన్ని చాటారు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
ధోనీ ప్రస్తావన తీసుకురాకున్నా.. అతని సిద్దాంతాన్ని గంభీర్ తప్పుబట్టాడు.ఇక ధోనీ ఫలితాల కంటే ప్రక్రియనే నమ్ముతాడు. ప్రక్రియ సరిగ్గా ఉంటే ఫలితాలు వాటంతటే అవే వస్తాయని తరుచూ చెబుతుంటాడు. ఈ ఆలోచన తీరుతోనే అతను సక్సెస్ఫుల్ కెప్టెన్గా నిలిచాడు. భారత్కు రెండు ప్రపంచకప్లు, ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఐపీఎల్లో సీఎస్కే ఐదు టైటిళ్లు అందించాడు.
ఆర్సీబీ అభిమానుల కంటేనా..?
ఇటీవల ధోనీని పొగడటం మొదలుపెట్టిన గంభీర్.. కేకేఆర్తో మ్యాచ్ సందర్భంగా అతన్ని ఆలింగనం చేసుకొని అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇంతలోనే ఏమైందో ఏమో కానీ ధోనీ విధానాలను తప్పుబడుతూ తన నోటికి పనిచెప్పాడు. గంభీర్ తాజా వ్యాఖ్యలపై చెన్నై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేకేఆర్ అభిమానుల కంటే.. ఒక్క టైటిల్ గెలవని ఆర్సీబీ ఫ్యాన్స్.. రెండేళ్ల పాటు నిషేధం విధించినా ఏ మాత్రం ప్రేమను తగ్గించుకోని సీఎస్కే ఫ్యాన్స్ అత్యంత నమ్మకస్తులని కామెంట్ చేస్తున్నారు.