ఐపీఎల్ 2024 సీజన్కు రంగం సిద్దమవుతోంది. మరో మూడు రోజుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్కు తెరలేవనుంది. శుక్రవారం చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ కోసం అన్ని జట్లు తమ సన్నాహకాలను ప్రారంభించాయి.
సోషల్ మీడియా వేదికగా అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. జెర్సీ ఆవిష్కరణ, థీమ్ సాంగ్స్.. ప్రాక్టీస్ మ్యాచ్లతో హడావుడి చేస్తున్నాయి. అయితే ఐపీఎల్ 2024 సీజన్ కోసం మూడు ఫ్రాంచైజీలు ఒకే తరహా జెర్సీని ఆవిష్కరించాయి. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జెర్సీలు ఒకే తరహాలో ఉన్నాయి.

పంజాబ్ కింగ్స్ జెర్సీలో ప్యాంట్ బ్లూ కలర్లో ఉండగా.. టీ షర్ట్ ఆరెంజ్ కలర్లో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తిగా బ్లూ కలర్లో ఉండగా షోల్డర్స్ ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. ఆర్సీబీ టీషర్ట్ పై భాగం బ్లూ కలర్లో ఉండగా.. కింది భాగం ఆరెంజ్ కలర్లో ఉంది.
ఈ మూడు జట్ల జెర్సీలను చూసి అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. జెర్సీల రంగులు దొరకలేదా..? అనుకోకుండా ఇలా జరిగిందా..? అని కామెంట్ చేస్తున్నారు. ఈ మూడు జట్లు ఒకరికొకరు తలపడ్డప్పుడు అభిమానులు, అంపైర్లు కన్ఫ్యూజ్ కావడం ఖాయమని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూడు జట్ల జెర్సీలకు సంబంధించి నెట్టింట జోకులు పేలుతున్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషభ్ పంత్ ఈ సీజన్తో మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతను గతేడాదిన్నరగా ఆటకు దూరమయ్యాడు. ఈ సీజన్లో సత్తా చాటి టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలని భావిస్తున్నాడు. రెండో సంతానంగా కొడుకు పుట్టడంతో ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు దూరమైన ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ.. ఈ సీజన్తోనే మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు.