ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఘోర తప్పిదం చోటు చేసుకుంది. ఈ బ్లండర్ మిస్టేక్ను చూసి అభిమానులంతా షాకయ్యారు. ప్రస్తుతం ఈ తప్పిదానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ(27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 49), ఇషాన్ కిషన్(23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 42), రోమారియో షెఫర్డ్ (10 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 39 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు.

ఢిల్లీ విజయానికి 20 ఓవర్లలో 235 పరుగులు అవసరమయ్యాయి. అయితే వాంఖడే మైదాన సిబ్బంది ఈ విషయంలో ఘోర తప్పిదం చేశారు. మైదానంలోని స్కోర్ బోర్డులో ఢిల్లీ విజయానికి 235 పరుగుల కావాలని రాసే బదులు ఢిల్లీ క్యాపిటల్స్ 235 పరుగుల తేడాతో గెలిచిందని పేర్కొన్నారు. ఈ బ్లండర్ మిస్టేక్పై ఢిల్లీ క్యాపిటల్స్ ఎక్స్ వేదికగా తనదైన శైలిలో స్పందించింది.
ఈ ఫొటోను షేర్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. 'ఇది నిజమైతే ఇంతకన్నా షాక్ లేదు'అని క్యాప్షన్గా పేర్కొంది. నెటిజన్లు మాత్రం వాంఖడే మైదాన సిబ్బంది వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 'నిద్రలో నుంచి లేచారా?'అని ఒకరంటే.. స్కోర్ బోర్డు బాయ్స్.. మ్యాచ్ను పట్టించుకోకుండా మందేసారని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 29 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 235 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగులే చేసి ఓటమిపాలైంది. పృథ్వీ షా(40 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 66), ట్రిస్టన్ స్టబ్స్(25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్లతో 71 నాటౌట్) రాణించినా ఫలితం లేకపోయింది.