చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దుమ్మురేపాడు. విధ్వంసకర బ్యాటింగ్తో పాత ధోనీని తలపిస్తూ బౌలర్లను వణికించాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో వైజాగ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో ధోనీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 37 పరుగులతో అజేయంగా నిలిచాడు.
అన్రిచ్ నోకియా వేసిన ఆఖరి ఓవర్లో అయితే 4, 6, 0, 4, 0, 6లతో 20 పరుగులు చేశాడు. శివమ్ దూబే ఔటైన అనంతరం 8వ స్థానంలో బ్యాటింగ్కు దిగిన ధోనీ వచ్చి రావడంతోనే బౌండరీ బాదాడు. ఆ మరుసటి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న తన వింటేజ్ బ్యాటింగ్తో చెలరేగాడు. తనకు అచ్చొచ్చిన విశాఖ మైదానంలో పాత ధోనీని తలపిస్తూ బౌలర్లను భయపెట్టాడు.

ఖలీల్ అహ్మద్ వేసిన 18వ ఓవర్లో ధోనీ కొట్టి సిక్స్ ఈ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. ఇక ధోనీ క్రీజులోకి అడుగుపెట్టినప్పటి నుంచి మ్యాచ్ ముగిసేవరకు విశాఖ మైదానం అభిమానుల అరుపులతో దద్దరిల్లింది. అతని బ్యాటింగ్కు రావడం చూసి అభిమానులు తమ సంతోషాన్ని ఆపుకోలేకపోయారు.
గట్టిగా అరుస్తూ రచ్చ రచ్చ చేశారు. అభిమానుల అరుపుల నేపథ్యంలో ఢిల్లీ ఆటగాళ్లు ఒత్తిడికి గురై తప్పిదాలు చేశారు. ఢిల్లీ ఫ్రాంచైజీ విశాఖ మైదానాన్ని హోమ్ గ్రౌండ్గా ఎంచుకున్నా.. చెన్నై హోమ్ గ్రౌండ్ను తలపించింది. మైదానమంతా పసుపు కలర్తో నిండిపోయింది. ఈ మ్యాచ్లో ఓడినా ధోనీ బ్యాటింగ్ అభిమానులను అలరించింది. ఢిల్లీ క్యాపిటల్స్ విజయం.. ధోనీ వింటేజ్ బ్యాటింగ్తో కొట్టుకుపోయింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 52), రిషభ్ పంత్(32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. పృథ్వీ షా(27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 43) మెరుపులు మెరిపించాడు.
చెన్నై బౌలర్లలో మతీష పతీరణ మూడు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులే చేసి ఓటమిపాలైంది. అజింక్యా రహానే(30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 45), మహేంద్ర సింగ్ ధోనీ(16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 37 నాటౌట్), డారిల్ మిచెల్(26 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 34) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్కు ఓ వికెట్ దక్కింది.