చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్ మతీష పతీరణ ఖతర్నాక్ క్యాచ్తో ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో వైజాగ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో పతీరణ కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసంతో ఆకట్టుకున్నాడు. గాల్లోకి అమాంతం ఎగురుతూ పతీరణ అందుకున్న అసాధ్యమైన క్యాచ్కు ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ బిత్తరపోయాడు.
నమ్మశక్యం కానీ క్యాచ్ను చూసి కొద్దిసేపు క్రీజును వదలకుండా అక్కడే నిలబడిపోయాడు. చివరకు ఔటయ్యననే విషయాన్ని గ్రహించి భారంగా మైదానం వీడాడు. ప్రస్తుతం ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ముస్తాఫిజుర్ వేసిన 10వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఓవర్ మూడో బంతిని స్లోయర్ ఫుల్ టాస్గా వేయగా.. డేవిడ్ వార్నర్ రివర్స్ స్కూప్ షాట్తో భారీ షాట్ ఆడాడు. బంతి కూడా మంచి స్ట్రోక్లో తగిలింది. కానీ పతీరణ అద్భుతంగా గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు.
ఈ క్యాచ్ చూసిన బిత్తరపోయిన డేవిడ్ వార్నర్.. భారంగా మైదానం వీడాడు. మహేంద్ర సింగ్ ధోనీ ఈ క్యాచ్కు ఫిదా అయ్యాడు. వారెవ్వా అంటూ చప్పట్లతో అభినందించాడు. ఈ క్యాచ్ను చూసిన నెటిజన్ల 'వావ్.. టోర్నీ ఆఫ్ ది క్యాచ్'అని కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 52), రిషభ్ పంత్(32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. పృథ్వీ షా(27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 43) మెరుపులు మెరిపించాడు.
చెన్నై బౌలర్లలో మతీష పతీరణ మూడు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. రీఎంట్రీ తర్వాత తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన రిషభ్ పంత్..ఈ మ్యాచ్లో తన అసలు సిసలు ఆటను చూపించాడు. తొలి 23 బంతుల్లో 23 పరుగులే చేసిన అతను తర్వాతి 9 బంతుల్లో 28 పరుగులు చేశాడు.