చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ డారిల్ మిచెల్.. ఓ అభిమాని మొబైల్ పగలగొట్టాడు. ఆ తర్వాత తన తప్పిదం తెలుసుకొని సదరు అభిమానికి విలువైన బహుమతిని అందజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. పంజాబ్ కింగ్స్తో గత ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియోపై నెటిజన్లు కూడా ఫన్నీగా స్పందిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
పంజాబ్ కింగ్స్తో గత ఆదివారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 28 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు మైదానంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న డారిల్ మిచెల్.. ఒక్కసారిగా బంతిని ప్రేక్షకుల స్టాండ్స్లోకి కొట్టాడు. మ్యాచ్ ప్రారంభానికి 2 గంటల ముందే కొందరు అభిమానులు మైదానానికి వచ్చారు.

తమ అభిమాన ఆటగాళ్ల బ్యాటింగ్ ప్రాక్టీస్ను వీడియోలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే డారిల్ మిచెల్ కొట్టిన బంతి ఓ చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని మొబైల్కు బలంగా తాకింది. దాంతో ఆ ఫోన్ వెనుక భాగం పూర్తిగా పగిలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న డారిల్ మిచెల్.. సదరు అభిమానికి క్షమాపణలు చెప్పడంతో పాటు తన గ్లోవ్స్ను బహుమతిగా అందజేశాడు.
తన ఖరీదైన ఐఫోన్ పగిలిందనే బాధ కంటే డారిల్ మిచెల్ గ్లోవ్స్ ఇచ్చాడనే సంతోషంతో సదరు అభిమాని ఎగిరి గంతేసాడు. అయితే ఖరీదైన ఫోన్ పగలగొట్టుకొని గ్లోవ్స్తో ఏం చేస్తాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. డారిల్ మిచెల్.. గ్లోవ్స్కు బదులు మొబైల్ కొనివ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. సదరు అభిమాని తల్లి ఈ వీడియో చూస్తే అతని వీపు మోగుతుందని ఫన్నీ కామెంట్ చేస్తున్నారు.

ఐపీఎల్ 2024 సీజన్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడిన ఆ జట్టు 6 మ్యాచ్ల్లో విజయం సాధించి పాయింట్స్ టేబుల్లో మూడో స్థానంలో కొనసాగుతుంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఆ జట్టు తమ చివరి మూడు మ్యాచ్ల్లో రెండింటిలో గెలవాలి.
సీఎస్కే తమ చివరి మూడు మ్యాచ్లను గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీతో తలపడనుంది. ఈ మూడు మ్యాచ్ల్లో చెన్నై వేదికగ ఒకే ఒక్క మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం సీఎస్కేను గాయాల బెడద వేధిస్తోంది. కీలక ఆటగాళ్లు గాయం లేదా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ జట్టు తదుపరి మ్యాచ్ శుక్రవారం గుజరాత్ టైటాన్స్తో అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.