ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు దుమ్మురేపారు. కట్టుదిట్టమైన బౌలింగ్తో రాజస్థాన్ రాయల్స్ను 141 పరుగుల స్వల్ప స్కోర్కే పరిమితం చేశారు. ముఖ్యంగా సీఎస్కే పేసర్లు తుషార్ దేశ్పాండే(2/30), సిమర్జిత్ సింగ్(3/26), శార్దూల్ ఠాకూర్(0/32) పరుగులు ఇవ్వకుండా బౌలింగ్ చేశారు.
సీఎస్కే బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో మాస్టర్ ప్లాన్కు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు ఉక్కిరి బిక్కిరయ్యారు. ప్రతీ ఓవర్కు రెండు బౌన్సర్ల నిబంధనను ఉపయోగించుకున్న సీఎస్కే బౌలర్లు.. సరైన లెంగ్త్లో బౌలింగ్ చేసి రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా సిమర్జిత్ సింగ్.. బౌన్సర్లతోనే రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లను కట్టడి చేశాడు.

పిచ్కు తగ్గ లెంగ్త్లో బౌలింగ్ వేయించిన డ్వేన్ బ్రావో.. ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు. సిమర్జిత్ సింగ్ సూపర్ బౌలింగ్కు రాజస్థాన్ రాయల్స్ టాప్-3 బ్యాటర్లు యశస్వి జైస్వాల్(24), జోస్ బట్లర్(21), సంజూ శాంసన్(15) పెవిలియన్ చేరారు. తుషార్ దేశ్పాండే ధాటికి ధ్రువ్ జురెల్(28), శుభమ్ దూబే(0) ఔటయ్యారు. రియాన్ పరాగ్(35 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 47 నాటౌట్) రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ 141 పరుగులు చేసింది.
సహజంగా చెపాక్ మైదానం స్పిన్కు అనుకూలంగా ఉంటుంది. కానీ సీఎస్కే స్పిన్నర్లు ఒక్క వికెట్ కూడా తీయలేదు. మహీష్ తీక్షణ(0/28), రవీంద్ర జడేజా(0/24) వికెట్లు తీయకపోయినా.. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.